Medha Patkar: అమరావతిలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకున్నారు కానీ రాజధాని నిర్మాణం..: మేధా పాట్కర్
రైతులకు తిరిగి భూములు కూడా ఇవ్వడం లేదని మేధా పాట్కర్ అన్నారు.
- T Venkateshwarlu
- Published On : July 30, 2023 / 04:59 PM IST
Medha Patkar - Vijayawada
Medha Patkar – Vijayawada: విజయవాడలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కర్షక, కార్మిక రాష్ట్ర సదస్సు జరిగింది. ఇందులో జాతీయ నేతలు అతుల్ కుమార్ అంజన్ (Atul Kumar Anjan), మేధా పాట్కర్ (Medha Patkar), వడ్డే శోభనాద్రీశ్వరావు (Vadde Sobhanadreeswara Rao), కిసాన్ సభ జాతీయ నాయకులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. అమరావతిలో ఏపీ రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం అమరావతి రైతులను ఇబ్బంది పెడుతుంటే వారు పోరాటం చేస్తున్నారని అన్నారు. రైతుల నుంచి భూములు తీసుకున్నారు.. కానీ, రాజధాని నిర్మాణం మాత్రం జరగలేదని విమర్శించారు.
రైతులకు తిరిగి భూములు కూడా ఇవ్వడం లేదని మేధా పాట్కర్ అన్నారు. అమరావతిలో వ్యవసాయం కూడా జరగడం లేదని చెప్పారు. రైతులకు సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏపీలో ఇంకా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు.
ఆదివాసీలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి, అలాగే, పోలవరం నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలకు తాము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయకూడదని నిరసనలు తెలుపుతున్న కార్మికులకు మద్దతు ఇస్తున్నామని అన్నారు.
ఢిల్లీలో రైతుల ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని కూడా ఇప్పటికీ అమలు చేయలేదని మేధా పాట్కర్ అన్నారు. పార్లమెంట్లో ఒక్క బిల్లుపై కూడా చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకుంటున్నారని విమర్శించారు.
