ఫైల్స్‌ను దహనం చేసిన ఘటనపై అధికారుల విచారణ.. ఎవరినీ వదలబోమన్న మంత్రి కొల్లు రవీంద్ర

Ministry of Mines Files Burnt Issue: గోనె సంచి మూటల్లో ఫైల్స్ తీసుకువచ్చి దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేసినట్టు అధికారులు..

Kollu Ravindra

విజయవాడలో ప్రభుత్వ ఫైల్స్ దహనం కేసుపై అధికారులు సీరియస్ అయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫైల్స్‌ను దహనం చేసిన చోట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత రాత్రి స్థానికంగా ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఫైల్స్ దహనం వంటి చర్యలకు పాల్పడ్డారా అన్న విషయాలపై అన్న వివరాలు రాబట్టేందుకు ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.

గోనె సంచి మూటల్లో ఫైల్స్ తీసుకువచ్చి దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేసినట్టు అధికారులు నిర్ధారణ చేసుకున్నారు. హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ శాఖ ఫైల్స్ దగ్ధం చేసిన ఎవరినీ వదలబోమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

గతరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వచ్చి యనమలకుదురు కరకట్టపై.. రికార్డులు దగ్ధం చేయడంపై కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో కొంత మంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఫైల్స్ దహనం చేసిన ఘటన ఏపీలో కలకలం రేపుతోంది.

కృష్ణా నది ఇసుక తిన్నెల వద్ద కారును ఆపిన కొందరు వ్యక్తులు ఫైల్స్ తగలబెడుతుండగా స్థానికులు చూశారు. కారులో వచ్చిన వారు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఫైల్స్ ను కొందరు వ్యక్తులు కాల్చిపారేసినట్లు టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలు ఫైల్స్, హార్డ్ డిస్కులు కాలిపోయాయని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చెప్పారు.

Also Read: మైలార్ దేవ్‌పల్లిలో కార్డెన్ సెర్చ్.. గంజాయి వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు