MP Mithun Reddy
Mithun Reddy: సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కీలక మలుపు తీసుకుంది. కొత్త బ్రాండ్లు, అక్రమాలు అంటూ మద్యం కేసులో ఏ4గా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్రెడ్డి..ఈ ఏడాది జూలై 19న సిట్ ముందు లొంగిపోయారు. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మిథున్రెడ్డి ఏసీబీ కోర్టు, హైకోర్టులో ఎక్కడా తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో రెండు నెలల క్రితం తనంతట తానే..ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు చేరుకుని సిట్ ముందు హాజరయ్యారు.
ఆ రోజు రాత్రి వరకు ఆయనను విచారించిన సిట్ టీమ్ ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. నెక్స్ట్ డే మిథున్రెడ్డిని కోర్టులో హాజరు పరిచి..రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. ఇప్పటివరకు 71 రోజుల పాటు జైలులో ఉన్నారు మిథున్రెడ్డి. మధ్యలో ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తే..ఢిల్లీ వెళ్లి ఓటు వేసి వచ్చిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు మిథున్రెడ్డి.
ఎంపీ మిథున్రెడ్డి బెయిల్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. పలు సార్లు వాయిదాలు, విచారణల తర్వాత..విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఏసీబీ కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లి అడ్డుపడకపోతే..మిథున్రెడ్డి విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అప్పీల్కు వెళ్తే అడ్డంకులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
Also Read: డైలమాలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. దీనిపై సస్పెన్స్
ఇప్పటికే లిక్కర్ కేసులో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్లలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అలాగే మరో వ్యక్తికి ఏసీబీ కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడం కీలక పరిణామంగా చెబుతున్నారు. అయితే మిథున్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో రూ.3,500 కోట్ల మేర మద్యం స్కాం చేశారని మిథున్ రెడ్డితోపాటు మిగిలిన నిందితులపై సిట్ అభియోగాలు నమోదైంది. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చగా, 12 మందిని అరెస్టు చేశారు. ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఏ4 మిథున్ రెడ్డితోపాటు మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులుగా చెబుతున్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, రిటైర్డ్ ఆర్డీవో క్రిష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ చార్టడ్ అకౌంటెంట్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టు అయిన వారిలో ఉన్నారు.
వీరికి ఇంకా నో బెయిల్..
వీరిలో కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, చెవిరెడ్డికి ఇంకా బెయిలు లభించలేదు. ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప, క్రిష్ణమోహన్ రెడ్డికి ఇప్పటికే డిఫాల్ట్ బెయిలు దక్కింది. మిథున్ రెడ్డికి బెయిలు దక్కడంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించగా, ఈడీ అరెస్టులు చేసే అవకాశాలపై నిందితులు భయపడుతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఏసీబీ కోర్టు బెయిలు ఇస్తూ ఊరట కల్పించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మిథున్ రెడ్డికి బెయిలు లభించడంతో త్వరలో మిగిలిన నిందితులు కూడా జైలు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మిథున్రెడ్డి అరెస్ట్తో వైసీపీలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. జగన్కు అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొడుకు అయిన ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్తో అలజడి కనిపించింది. కూటమి ప్రభుత్వం మిథున్రెడ్డి అరెస్ట్తో పెద్ద ఇండికేషనే పంపించినట్లు అయింది. ఆ టైమ్లోనే నెక్స్ట్ కీలక నేత అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ క్యాడర్, లీడర్లలో అయోమయం నెలకొంది. పార్టీ అధినేత జగన్ చుట్టే ఉచ్చు బిగుస్తుందన్నట్లుగా కూటమి లీడర్లు ఇచ్చిన స్టేట్మెంట్లతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
ఈ క్రమంలోనే ఇన్నాళ్లు వైసీపీ పూర్తిగా నైరాశ్యంలో ఉందన్న టాక్ నడిచింది. సరిగ్గా ఇదే టైమ్లో మిథున్రెడ్డికి బెయిల్ రావడంపై ఫ్యాన్ పార్టీ నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సేమ్టైమ్ ఈడీ విచారణ వైసీపీని టెన్షన్ పెడుతూనే ఉంది. ఏసీబీ కేసులు అలా కొనసాగుతుంటే..మనీలాండరింగ్ అంటూ ఈడీ ఎంటరైతే మళ్లీ తలనొప్పులు తప్పవని భావిస్తున్నారట. ఇప్పటికైతే ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్తో హ్యాపీగా ఫీల్ అవుతూనే..ఈడీ భయంతో వణికిపోతున్నారట లీడర్లు.