MLA Roja : ఏపీ విభజన సమస్యలపై కేంద్రం కమిటీ.. జగన్ సాధించిన విజయం అన్న రోజా
ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు. ఇది సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు.
- Naveen
- Published On : February 12, 2022 / 05:15 PM IST
Mla Roja
MLA Roja : ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం కమిటీ వేయడం శుభపరిణామం అని ఆమె అన్నారు. ఇది సీఎం జగన్ సాధించిన విజయంగా అభివర్ణించారు. గత నెల కూడా సీఎం జగన్ విభజన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని రోజా చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీతో రాజీపడ్డ చంద్రబాబుకు.. ఇది చెంపపెట్టు అన్నారు రోజా. మన కష్టం, నష్టం గమనించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు రోజా. విభజన సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ చేసిన పోరాటానికి ఫలితం దక్కనుందని రోజా చెప్పారు.
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత మిగిలిపోయిన సమస్యల పరిష్కారంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిశ్, ఏపీ ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అని తేల్చి చెప్పిన కేంద్ర హోంశాఖ.. తాజాగా ఎజెండాలో స్పెషల్ స్టేటస్ అంశాన్ని చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై దృష్టి సారించిన కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాసింది. ఈ నెల 17న విభజన సమస్యలపై సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలిపింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఏయే అంశాలు చర్చించాలన్న విషయంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం అందించింది. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జరుపుతామని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరగనుంది. సమావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉండడం గమనార్హం. వనరుల సర్దుబాటు, 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదల అంశం కూడా ఉన్నాయి.
కమిటీ సమావేశంలో ఎజెండాలోని కీలక అంశాలు..
1. ప్రత్యేక హోదా
2. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
3. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యల పరిష్కారం
4. పన్నుల వ్యవహారంపై చర్చ
5. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ డిపాజిట్ విభజన
6. వనరు వ్యత్యాసంపై చర్చ
7. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్ పై చర్చ
8. పన్నులు, ప్రోత్సాహాలు
9. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల మధ్య క్యాష్ క్రెడిట్ పై చర్చ
