MLC Elections Results 2023: రెండో ప్రాధాన్య ఓటే కీలకం కానుందా..! పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం 49మంది పోటీ చేయగా, 2.45 లక్షల ఓట్లు (74%శాతం) పోలయ్యాయి. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 12 మంది పోటీ చేయగా, 25 వేల ఓట్లు (91.9% శాతం) పోలయ్యాయి.
- Harishth Thanniru
- Published On : March 16, 2023 / 09:39 AM IST
mlc election
MLC Elections Results 2023: తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం 8గంటల నుంచి ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ను అధికారులు ప్రారంభించారు. తొలుత అనంతలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను ఓపెన్చేసి అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను అధికారులు ఓపెన్ చేశారు. ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో అనంత, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ పెట్టేలను లెక్కింపు కేంద్రంలో భద్రపరిచారు. లెక్కింపు ప్రక్రియ రాత్రింబవుళ్లు జరగనుండటంతో తగిన ఏర్పాట్లు, వసతులు సమకూర్చారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీకి మొత్తం 49మంది పోటీ చేయగా, 2.45 లక్షల ఓట్లు (74%శాతం) పోలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం 24 టేబుల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్లో 10 నుంచి 11 రౌండ్లు కొనసాగనున్నాయి. ప్రతి రౌండ్ కు సుమారు మూడు గంటల సమయం పట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 12 మంది పోటీ చేయగా, 25 వేల ఓట్లు (91.9% శాతం) పోలయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆరు గంటల్లో తొలి ప్రధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ సమయంలో 600మందికి పైగా సిబ్బంది పనిచేయనున్నారు. అయితే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేందుకు అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు వచ్చేందుకు 2నుంచి 3రోజులు పట్టే అవకాశం ఉంది.
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 16న ఫలితాలు వెల్లడి
పట్టభద్రుల స్థానానికి 49 మంది, ఉపాధ్యాయ స్థానానికి 12 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరికొద్ది గంటల్లో వీరి భవితవ్యం తేలనుంది. అయితే, పట్టభద్రుల్లో ముగ్గురు, ఉపాధ్యాయ స్థానంలో నలుగురి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకుల అంచనా. వీరిలో ఎవరైనా తొలి ప్రాధాన్య ఓటుతో గెలిచే అవకాశాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. రెండో ప్రాధాన్య ఓటే కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
