Panchumarthi Anuradha: వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ గెలుపు ఖాయం: పంచుమర్తి అనురాధ
టీడీపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. మంత్రి రోజా మాటలకు నిబద్ధత లేదని, ఆమె ఒకరిని వెళ్లి కలవడం కొద్దిరోజులకు వారిని తిట్టడం పరిపాటిగా మారిందని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : March 26, 2023 / 07:37 PM IST
Panchumarthi Anuradha
Panchumarthi Anuradha: టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రాయలసీమలో అన్ని స్థానాల్లోనూ టీడీపీ గెలుపు ఖాయం అనిపిస్తోందని ఆ పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ అన్నారు. ఆమె ఇటీవలే టీడీపీ ఎమ్మెల్సీగా గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలంలో జరుగుతున్న నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొని పంచుమర్తి అనురాధ మాట్లాడారు.
నారా లోకేశ్ పాదయాత్ర ఒక ప్రభంజనంలా ముందుకెళుతోందని పంచుమర్తి అనురాధ చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. రాజీనామా చేశాకే తన పార్టీలోకి రావాలని చెప్పిన సీఎం జగన్ టీడీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఏ విధంగా పార్టీలో చేర్చుకున్నారని ఆమె నిలదీశారు.
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా మంత్రి ఉష శ్రీ శరణం సమక్షంలోనే డబ్బులు పంపకాలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చినా ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. మంత్రి రోజా మాటలకు నిబద్ధత లేదని, ఆమె ఒకరిని వెళ్లి కలవడం కొద్దిరోజులకు వారిని తిట్టడం పరిపాటిగా మారిందని అన్నారు.
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కూడా పులివెందులకు నీళ్లు తీసుకురాలేకపోయారని, చంద్రబాబు నాయుడు సారథ్యంలో గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు ఇచ్చామని పంచుమర్తి అనురాధ తెలిపారు. కష్టపడి పని చేయడం వల్లనే పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం సాధించారని వ్యాఖ్యానించారు.
MLA Jagga Reddy : అద్వానీ ప్రధాని కాకుండా మోడీ కుట్రలు చేశారు- ఎమ్మెల్యే జగ్గారెడ్డి
