Pawan Kalyan: నాకు హీరోలందరూ ఎందుకు ఇష్టం అంటే? ఇవాళ మహేశ్ బాబు ఫ్యాన్ నన్ను కలిసి..?: పవన్ కల్యాణ్
ఓట్లు చీలడం వల్ల ఒక్కోసారి ప్రజా వ్యతిరేకత ఉన్న వారు గెలుస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.
- T Venkateshwarlu
- Published On : June 25, 2023 / 07:22 PM IST
Pawan Kalyan
Pawan Kalyan – JanaSena: సినీ హీరోలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాజోలు (Razole) నియోజక వర్గం మలికిపురంలో పవన్ కల్యాణ్ ఇవాళ బహిరంగ సభలో మాట్లాడారు. ” నాకు ఎందుకు హీరోలందరూ ఇష్టం అంటే.. వారు ఒక్కో సినిమా చేసి 600 మందికి పైగా ఉపాధి కల్పిస్తారు. జీఎస్టీ కడతారు, సాయం చేస్తారు, అందుకే నాకు ఇష్టం ” అని చెప్పారు.
ఇవాళ సభకు వస్తుంటే దారిలో ఒక మహేశ్ బాబు అభిమాని వచ్చి తాను మహేశ్ అభిమాని అని, కానీ రాజకీయంగా మీకు అండగా ఉండి, ఓటేస్తాను అన్నాడని, చాలా సంతోషించానని తెలిపారు.
కాగా, జనసేనను చూసి కొందరు భయపడుతున్నారని, ఎందుకంత భయమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎందుకంటే తాము ఏదో ఒక కులం కోసం రాజకీయం చేయట్లేదని అన్నారు. అన్ని కులాల కోసం పనిచేస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత స్వార్థం కోసం పని చేయడం లేదని తెలిపారు. జనసేన పార్టీ 150 మందితో ప్రారంభమైందని చెప్పారు.
తాను కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదని చెప్పారు. ఆంధ్రలో కులాలుగా విడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలలో మార్పు కోసం పనిచేస్తున్నామని, అందుకే తామంటే కొందరికి భయమని చెప్పారు. ప్రజలు మద్దతు కూడగట్టే నాయకులు రావాలని అన్నారు. అభివృద్ధిని ఉభయగోదావరి జిల్లాల నుంచి మొదలు పెడదామని పవన్ కల్యాణ్ చెప్పారు.
పొట్టి శ్రీ రాములు బలిదానం మీద ఏపీ ఏర్పడిందని అన్నారు. ప్రజలు కట్టిన ట్యాక్స్ లను ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వారికి పంచి పెడదాం అంటే కుదరదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానేయాలని చెప్పారు. తన ఆఖరి క్షణం కోసం ప్రజలు కోసం కష్టపడతానని చెప్పారు.
ఎడారిలో ఒయాసిస్ లాంటి గెలుపు..
గత ఎన్నికల సమయంలో తమకు ఎడారిలో ఒయాసిస్ లాంటి గెలుపును రాజోలు ప్రజలు ఇచ్చారని అన్నారు. గుండె కోతకి గురి అయినప్పుడు 2019లో రాజోలు జనసేన గెలుపు సేద తీర్చినట్లు అయిందని చెప్పారు. రాజోలు ప్రజలు ఇచ్చింది మామూలు గెలుపు కాదని చెప్పారు. దెబ్బతిన్న పరిస్థితుల్లో తనకు ఒక ఆశని ఇచ్చారని అన్నారు.
క్రిమినల్స్ ను తట్టుకుంటూ రాజోలు ప్రజలు వెలిగించిన చిరు దీపం కడప జిల్లా రాజంపేట వరకు జ్యోతిలా వెలుగుతుందని తెలిపారు. ఓట్లు చీలడం వల్ల ఒక్కోసారి ప్రజా వ్యతిరేకత ఉన్న వారు గెలుస్తున్నారని చెప్పారు. ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. బటన్ నొక్కితే అందరికీ డబ్బులు పడుతున్నాయా? అని సీఎం జగన్ ను ఉద్దేశించి అన్నారు.
వారే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి..
ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు-ముగ్గురు ముఖ్య నాయకులు పోటీ పడతారని, వారిలో ఎవరు ఎక్కువగా ప్రజలను ఆకట్టుకొగలిగితే వారే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని తెలిపారు. జనసేన నాయకులు అందరూ ఎమ్మెల్యే అవ్వడానికి పోటీ పడాలని చెప్పారు. నేటి సభకు వచ్చిన జనం అందరూ డబ్బు ఇస్తే రాలేదని, ప్రేమతో వచ్చారని తెలిపారు. తాను చేస్తున్నది చాలా కష్టసాధ్యమని చెప్పారు. గతంలోనూ చాలా మంది పార్టీ పెట్టారు స్థాపించారని, ఉద్యమాలు నడిపారని కానీ నిలబడలేకపోయారని తెలిపారు.
