Pawan Kalyan: నాపై దెబ్బ పడినట్లే లెక్క.. ఇక శ్రీకాళహస్తి వస్తా అక్కడే తేల్చుకుంటా: పవన్ కల్యాణ్
ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతోందని తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : July 13, 2023 / 03:44 PM IST
Pawan Kalyan
Pawan Kalyan – JanaSena: శాంతియుతంగా ధర్నా చేసేవారిని కొట్టే హక్కు ఏ పోలీసుకూ ఉండబోదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. తమ నాయకుడిని నిన్న కొట్టారని, తనపై దెబ్బ పడినట్లేనని తెలిపారు. శ్రీకాళహస్తి (Srikalahasti ) వస్తానని అక్కడే తేల్చుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. శ్రీకాళహస్తిలో జనసేన నాయకులపై సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ పవన్ ఈ హెచ్చరిక చేశారు.
” ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేసి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనకు అండగా ఉన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాజకీయాల్లో అంతర్గతంగానే ఎక్కువ శత్రువులు ఉంటారు. టీడీపీకి జనసేన బీ టీమ్ అని వైసీపీ విమర్శించడానికి తలుపులు తెరిచింది మనవాళ్లే అనేది తెలుస్తుంది.
రాజకీయాల్లో ప్రలోభాలు సర్వసాధారణం. వాటిని దాటుకుని ముందుకెళ్లడమే ముఖ్యం. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయి. ఇతర పార్టీలు మనల్ని విమర్శిస్తున్నాయంటే మనం బలంగా ఉన్నట్టు లెక్క. రాజకీయాల్లో ఎదురుదాడి చేస్తేనే ఉండగలుగుతాం.
రాజకీయాల్లోకి సరదాగా రాలేదు. దౌర్జన్యాలను దారి దారి దోపిడిలను క్రిమినల్స్ ను అడ్డుకుని ప్రజలకు సేవ చేయాలనే వచ్చా. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. జగన్మోహన్ రెడ్డి జగ్గు భాయ్ అవతారం ఎత్తాడు. బాబాయ్ ని చంపిన వారిని దారిదోపిడీలు, ఇసుక దోపిడీలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ అండగా ఉంటున్నాడు ” అని పవన్ చెప్పారు.
షర్మిల పార్టీపై పవన్ వ్యాఖ్యలు
తెలంగాణలో వైఎస్ షర్మిల స్థాపించిన రాజకీయ పార్టీ వైఎస్సార్టీపీపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపానని గుర్తు చేసుకున్నారు. కానీ ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతోందని తెలిపారు.
వేలకోట్ల రూపాయలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీని నడపడం అంత సులభతరం కాదని చెప్పారు. బలమైన రాజకీయ సిద్ధాంతం, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం దృఢంగా ఉండాలని అన్నారు. అధికారం కావాలనుకుంటే తాను అప్పుడే కాంగ్రెస్ లోకి వెళ్లేవాడినని తెలిపారు. సిద్ధాంతం నమ్మితే దానికోసం సచ్చిపోవాలని అన్నారు. జనసేనకు బలమైన రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని తెలిపారు.
JanaSena: పవన్ కల్యాణ్పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి: జనసేన ఆందోళనలు
