Pawan Jagan
అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, సీన్లు, మేనరిజం ప్రదర్శించినా కేసులు పెడతారా? అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న మీడియా సమావేశంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే.
దీనిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. “సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమనిబంధనలను పాటించాల్సిందే.
Also Read: రూ.10 వేలలోపే 5G స్మార్ట్ఫోన్లు.. ఈ 3 మోడళ్లను అస్సలు మిస్ అవ్వద్దు..
ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి… అసాంఘిక శక్తులను అదుపు చేస్తాము.
అశాంతిని, అభద్రతను కలిగించేవారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్నవారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టాలి. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా – వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలి. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దు” అని పవన్ కల్యాణ్ అన్నారు.