Perni Nani
Perni Nani on Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయనగరం నెల్లిమర్లలో నిన్న శంఖారావం సభలో మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అని అన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించడంపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ ఆశించిన దాని కంటే ఎక్కువగా గ్రామ వాలంటీర్లు సేవలందిస్తున్నారని పేర్ని నాని చెప్పారు. ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లు చొక్కా మడత పెట్టవలసిన సమయం ఆసన్నమైంది అన్నారని తెలిపారు. దీంతో లోకేశ్ కంగారు పడిపోయి కుర్చీ తీసుకుని వచ్చి దాన్ని మడత పెడతానంటున్నారని చెప్పారు.
లోకేశ్ కుర్చీలు మడత పెట్టినా, బెంచీలు మడత పెట్టినా ఫలితం ఏమీ ఉండదని పేర్ని నాని అన్నారు. లోకేశ్, చంద్రబాబు కలిసి వారి సమావేశాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలు మడత పెట్టుకోవచ్చని చెప్పారు. వాలంటీర్లను చూసి వారు భయపడుతున్నారని అన్నారు.
మొన్నటిదాకా వాలంటీర్లు అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారని ఓ పవర్ స్టార్ పవర్ లెస్ స్టార్ చెప్పారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అప్పుడు అలా వాగిన వాళ్లు ఇప్పుడు ఇప్పుడు వాలంటీర్ల గురించి ఏమీ మాట్లాడలేదని చెబుతున్నారని అన్నారు.