దర్శి ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు.. ఎందుకంటే..?
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి పొదిలి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
- Harishth Thanniru
- Published On : June 14, 2025 / 08:40 AM IST
Darsi YCP MLA Boochepalli Sivaprasad Reddy
Prakasam district: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికి పొదిలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు పోరుబాటలో శాంతి బద్రతలకు భంగం కల్గించినట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి పర్యటన రోజు స్టెరైల్ జోన్లోకి వైసీపీ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి బలవంతంగా ప్రవేశించారని, వ్యక్తిగత వాహనాలు హెలిప్యాడ్ వరకు వచ్చాయని, పట్టణంలో శాంతియుతంగా ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలపై దాడికి యత్నించి చెప్పులు, రాళ్లు విసిరారంటూ అభియోగాలు ఉన్నాయి. దీనికితోడు పోలీసులను గాయపర్చడంతోపాటు తమ విధులకు ఆటంకం కలిగించారని, పొగాకు బోర్డులోకి బలవంతంగా ప్రవేశించి బేళ్లను తొక్కి ఆస్తినష్టం కలిగించారని పొదిలి సీఐ వెంకటేశ్వర్లు నోటీసులో పేర్కొన్నారు.
ఈనెల 11న చోటుచేసుకున్న ఈ ఘటనలన్నింటికి మీరే భాధ్యత వహించవలసిన స్థాయిలో ఉన్నందున మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచెపల్లికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
