JanaSena – Pawan Kalyan: వాలంటీర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వాలంటీర్ సురేశ్ చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) కింద కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. చిట్టినగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోతిన మహేశ్ (Pothina Mahesh) ఆధ్వర్యంలో జనసేన నిరసన తెలిపింది. వైసీపీ (YCP) ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.
ఈ సందర్భంగా పోతిన మహేశ్ మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్వవస్థలో అనేక లోపాలున్నాయని చెప్పారు. వారు సేకరించే డేటాను హైదరాబాద్ లోని ఒక కంపెనీకి ఇస్తున్నారని, అందులోని 700 మందికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారని చెప్పారు. వాలంటీర్లు దొంగతనాలు చేయలేదా అని ప్రశ్నించారు. ఎర్ర చందనం దొంగతనాలకు పాల్పడలేదా? మహిళలపై రేపులు చేయలేదా? అని అన్నారు. ప్రజలందరూ వాలంటీర్లకు వారి సమాచారం ఇచ్చే ముందు ఆలోచించాలని కోరారు.
వాలంటీర్లు సేకరించిన డేటా పోలీసుల భద్రతలో ఉంచాలని పవన్ కోరితే ఆయనపై కేసులు నమోదు చేశారని అన్నారు. దీనిపై సీపీ సమాధానం చెప్పాలని కోరారు. పవన్ పై కేసులు నమోదు చేసేముందు డీజేపీ మీద, జగన్ మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు.