టీడీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద కోవర్ట్ అని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో పవన్ కల్యాణ్ 10 మంది జనసేన నాయకులకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లన్నీ బయటనుండి వచ్చినవారికే ఇచ్చారని అన్నారు.
పవన్ కల్యాణ్ అందరిముందు నటించి మాట్లాడుతున్నారని పోతిన మహేశ్ ఆరోపించారు. కాపులకు పవన్ ఏం న్యాయం చేశారని నిలదీశారు. గుంటూరు జిల్లాలో కాపులకు ఒక్క టికెటయినా ఇప్పించుకోగలిగారా అని ప్రశ్నించారు. మొదటి విడతలో తనకు టికెట్ రాకపోవడంతో రెండో విడతలో ఇస్తానని పవన్ హామీ ఇచ్చారని చెప్పారు.
చివరకు పెట్టుబడిదారుడు సుజనాకి టికెట్ ఇచ్చారని పోతిన మహేశ్ తెలిపారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన 11 మందికి టికెట్లు ఇచ్చారని, వారు రేపు అసెంబ్లీలో జనసేన వద్దు.. చంద్రబాబు కావాలంటారని చెప్పారు. తనకు జగన్ మీద నమ్మకం ఉందని తెలిపారు. తన భవిష్యత్తుకు గ్యారంటీ వైసీపీలోనే ఉందని, ఆ పార్టీలో చేరానని చెప్పారు.
Also Read: ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పిన బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి