Rammohan Naidu Complaint to Amit Shah On Sanjay
Ram Mohan Naidu Kinjarapu – Sanjay : ఏపీలో రాజకీయాలు రోజురోజుకి హీట్ ఎక్కిపోతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. చంద్రబా అరెస్ట్ తర్వాత పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది జగన్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన లోకేశ్ జాతీయ పార్టీల నాయకులను కలిశారు.
చంద్రబాబు అరెస్ట్ పై వారికి వివరిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రపతిని కూడా లోకేశ్ కలవడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు లోకేశ్. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తోందని, అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెడుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు లోకేశ్.
Also Read..CM Jagan : ఈసారి 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం అంటున్న జగన్ ధీమాకు కారణం ఏంటి?
తాజాగా టీడీపీ ఎంపీలు మరో అడుగు ముందుకేశారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ని టార్గెట్ చేశారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని తన ఫిర్యాదులో రామ్మోహన్ నాయుడు పేర్కొన్నట్లు సమాచారం. పూర్తి ఆధారాలతో అమిత్ షా కు రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిన అధికారి.. సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
దర్యాఫ్తు అంశాలను కోర్టులకు నివేదించాల్సిన బాథ్యత గల ఐపీఎస్ అధికారి వైసీపీ నేతలా ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిపక్ష నేతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. దర్యాఫ్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలను మీడియాకు విడుదల చేసినట్లు రామ్మోహన్ నాయుడు ఆరోపించినట్లుగా తెలుస్తోంది. సీఐడీ చీఫ్ సంజయ్ ఉల్లంఘించిన సర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధనలపై అన్ని ఆధారాలను కేంద్ర హోంశాఖ మంత్రికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పంపించినట్లుగా తెలుస్తోంది.
”సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ సంజయ్ వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ మేరకు రాజకీయ పక్షపాతాలు లేకుండా పని చేయాల్సిన సీఐడీ చీఫ్.. అన్నింటినీ ఉల్లంఘించారు. ఐపీఎస్ అధికారి సంజయ్ వైసీపీ కార్యకర్త మాదిరిగా పని చేస్తున్నారు. సీఎం జగన్ కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబుని అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిన అధికారి, ఎటువంటి విచారణ జరపకుండానే, సర్వీసు నిబంధనలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేయడం తీవ్రమైన నేరం. దర్యాప్తు అంశాలు రూపొందించి కోర్టులకి నివేదించాల్సిన బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి వైసీపీ నేతలా ఢిల్లీ, హైదరాబాద్, అమరావతిలో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రతిపక్ష నేతపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, దర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలు మీడియాకి విడుదల చేస్తున్నారు” అని తన ఫిర్యాదులో రామ్మోహన్ నాయుడు పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాదు సీఐడీ చీఫ్ సంజయ్ ఉల్లంఘించిన సర్వీస్ రూల్స్, అతిక్రమించిన నిబంధనలు, అడ్డగోలు ప్రవర్తనపై అన్ని ఆధారాలను హోంశాఖ మంత్రికి ఎంపీ రామ్మోహన్ నాయుడు పంపించారని సమాచారం.