School Bus : చిత్తూరులో వరదలో చిక్కిన స్కూల్ బస్.. పిల్లలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
చిత్తూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు.
- Naveen
- Published On : November 18, 2021 / 07:32 PM IST
School Bus
School Bus : అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. తిరుపతి, తిరుమలలో కుండపోత వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాలతో తిరుపతి నగరం జల సంద్రమైంది. కనుచూపు మేర వరద నీటితో తిరుపతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద కారణంగా పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి.
కాగా, చిత్తూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకుని వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది చాకచక్యంగా పిల్లలను కాపాడింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. వరద నీటిని సరిగా అంచనా వేయలేక అండర్ బ్రిడ్జి లోకి స్కూల్ బస్సుని డ్రైవర్ తీసుకెళ్లాడు. వరద నీటికి అండర్ బ్రిడ్జి మధ్యలో స్కూల్ బస్సు ఇరుక్కుపోయింది. కాగా, పిల్లలకు ప్రమాదం తప్పడంతో వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఇవాళ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ముందుగా హెచ్చరించినా జిల్లా విద్యాశాఖ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించ లేదు. దీంతో విద్యాశాఖ అధికారులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Urine : మూత్రం ఎరుపులో రంగులో ఉంటే డేంజర్లో పడ్డట్టేనా…
అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడకమార్గం, కనుమదారుల్లో వరద నీటితో పోటెత్తింది. నీటి ప్రవాహంతో మెట్లమార్గం జలపాతాన్ని తలపిస్తోంది. ముందు జాగ్రత్తగా నడకదారిని టీటీడీ మూసివేసింది.
వైకుంఠం క్యూలైన్లోని సెల్లార్లలోకి కూడా నీరు చేరింది. వర్షానికి మాడవీధులు జలమయమయ్యాయి. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణికి సమీపంలో రహదారిపై చెట్టుకూలింది. కొండపై నుంచి రహదారిపైకి రాళ్లు, మట్టి కొట్టుకొచ్చాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం బోర్డు చర్యలకు ఉపక్రమించింది. భారీ వర్షాల నేపథ్యంలో కనుమదారులను మూసివేసింది. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క
భారీ వర్షం కారణంగా తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్డు మూసివేశారు. ఘాట్ రోడ్లు తిరిగి ఎప్పుడు తెరిచేది తరువాత ప్రకటిస్తామన్నారు. తిరుమల రింగ్ రోడ్ లో ఏపీ టూరిజం హోటల్ వెనుక భాగంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏపీ టూరిజం హోటల్ కాంపౌండ్ వాల్ ధ్వంసమైంది. ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి.
