చంద్రబాబుకి ఈ విషయంపైనే ఎక్కువ శ్రద్ధ ఉంది: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
కరకట్టలో చంద్రబాబు నాయుడి ఇల్లు అక్రమ కట్టడమని, అందులో ఉండి మునిగిపోతే..
- T Venkateshwarlu
- Published On : September 2, 2024 / 02:28 PM IST
Seediri Appalaraju
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైసీపీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను తీర్చడంపై లేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. తుపాన్లు వచ్చి ప్రజలంతా తిండిలేక ఇబ్బందులు పడుతుంటే వారి గురించి పట్టించుకోకుండా వేరే పనులు చేస్తున్నారని విమర్శించారు.
సచివాలయాలు ఉన్నాయని, కనీసం ఆ సిబ్బందిని అప్రమత్తం చేయలేదని సీదిరి అప్పలరాజు చెప్పారు. జగన్ని తిట్టడానికే అనితకు హోంమంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. బుడమేరు గేట్లు అర్ధరాత్రి తెరవడంవల్లే విజయవాడ మునిగిపోయిందని, దీనికి బాధ్యత ఎవరిదని నిలదీశారు.
కరకట్టలో చంద్రబాబు నాయుడి ఇల్లు అక్రమ కట్టడమని, అందులో ఉండి మునిగిపోతే పరువుపోతుందని బస్సులో ఉంచారని అప్పలరాజు అన్నారు. బైటకేమో కలెక్టరేట్లో ఉన్నామని ప్రచారం చేస్తున్నారని, అధికారులందరితో కలిసి తిరుగుతూ ఉంటే ప్రజలకు ఏర్పాట్లు ఏవరు చేస్తారని నిలదీశారు. అనుభవం ఎక్కువ అయ్యాక చంద్రబాబులో నిర్లక్ష్యం ఎక్కువైందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం విఫలం చెందిందని, జగన్ ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదని విజయవాడ ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు.
Also Read: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు.. బదిలీ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా
