NIA Raids In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ప్రకటన విడుదల చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు, మత విద్వేషాలు పెంపొందించడానికి శిక్షణ ఇవ్వడం కోసం శిబిరాలను నిర్వహిస్తున్న PFI సంస్థ ప్రతినిధుల నివాసాల్లో సోదాలు నిర్వహించింది. కీలక వస్తువులు, ఆధారాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
తెలంగాణలోని 38 స్థానాల్లో (నిజామాబాద్లో 23, హైదరాబాద్లో 04, జగిత్యాలలో 07, నిర్మల్లో 02, ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఒక చోట) సోదాలు చేసింది. అలాగే ఆంధ్రాలోని రెండు చోట్ల NIA సోదాలు నిర్వహించింది. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదర్ మరో 26 మంది వ్యక్తులకు సంబంధించిన కేసులో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సోదాలు నిర్వహించింది.
NIA Raids in Andhra, Telangana: ఉగ్రమూలాలున్నాయన్న సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
ఇవాళ నిర్వహించిన సోదాల్లో, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు, రెండు బాకులు, రూ.8,31,500 నగదు సహా నేరారోపణ సామాగ్రిని NIA స్వాధీనం చేసుకుంది. విచారణ నిమిత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. జులై 4న తెలంగాణ పోలీసులు నిజామాబాద్లోని పిఎఫ్ఐ క్యాడర్లపై నమోదు చేసిన కేసులో భాగంగా ఏపీ, తెలంగాణలో ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది.
ఇప్పటికే నలుగురు నిందితులు అబ్దుల్ కాదర్, షేక్ సహదుల్లా, ఎండీ ఇమ్రాన్, ఎండీ అబ్దుల్ మోబిన్లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు పనిచేస్తున్నారని NIA ఆగస్టు 21న కేసు నమోదు చేసింది.