ఏపీలో కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం.. స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు
ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతామని.. విశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : June 10, 2024 / 11:53 AM IST
Swaroopanandendra Saraswati: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు ఏర్పడడం ఆనందంగా వుందని విశాఖపట్నం శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని తాము కూడా యాగాలు చేస్తున్నామని, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగుందలనేది తమ ఆకాంక్ష అని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతామని.. సంపాదించుకోవాలి, దోచుకోవాలని అనుకునే పీఠం తమది కాదన్నారు.
”ఏ ప్రభుత్వం వచ్చినా అమ్మవారి ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. నేను చంద్రబాబుని కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు. నా వ్యక్తిత్వం పెద్దలకు బాగా తెలుసు. అమరావతిలో సైతం శారద పీఠం కోసం స్థలం కొన్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికో భయపడి కాదు. స్వరూపానందేంద్ర ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఈ సారి అయినా దేవాదాయ శాఖ సరైన పాలన చేయాలి. ఏడు రాష్ట్రాల నుంచి గవర్నర్లు పీఠానికి వచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా పీఠాన్ని సందర్శించారు. కేవలం వైసీపీ నాయకులు మాత్రమే కాదు అన్ని పార్టీల నేతలు పీఠానికి వచ్చార”ని స్వరూపానందేంద్ర తెలిపారు.
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన నాయుడికి కేంద్ర మంత్రి పదవి రావడం ఆనందంగా వుందని, ఇది తెలుగు వారికి దక్కిన గౌరవమని అన్నారు.
