Rajya Sabha bypolls: నామినేషన్లు దాఖలు చేసిన రాజ్యసభ అభ్యర్థులు.. ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
బీజేపీ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా నేను ..
- Harishth Thanniru
- Published On : December 10, 2024 / 02:13 PM IST
R Krishnaiah
Rajyasabha By Elections: ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల్లో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో ఏపీలోని మూడు స్థానాలకు మంగళవారం కూటమి అభ్యర్థులు బీదా మస్తాన్ రావు (టీడీపీ), సానా సతీశ్ (టీడీపీ), ఆర్. కృష్ణయ్య (బీజేపీ) నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే, ముగ్గురు ఎన్నిక లాంఛనమే. ఎందుకంటే.. ప్రతిపక్ష వైసీపీ సరియైన బలం లేకపోవడంతో ఈ ఎన్నికలకు దూరంగా ఉంది.
Also Read: AP Rajyasabha: మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారు.. ఏకగ్రీవమే?
నామినేషన్లు దాఖలు అనంతరం బీదా మస్తాన్ రావు, సానా సతీశ్, ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఏపీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నం జరుగుతుందని, వారికితోడు మేముకూడా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజ్యసభ సభ్యులుగా తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ తరుపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆర్. కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో ఉన్నా నేను బీసీల సంక్షేమంకోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్ను పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పోరాడతా.. అవకాశం ఉన్నప్పుడు పార్టీకోసం పనిచేస్తానని చెప్పారు. బీజేపీయే తనను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని ఆర్. కృష్ణయ్య తెలిపారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఆర్. కృష్ణయ్య అభినందనలు తెలిపారు.
