Chandrababu Naidu : అమరావతిలో మీడియాతో చిట్ చాట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ ఫూల్ అనే పదం జగన్ కి సరిగ్గా సరిపోతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలందరినీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో జగన్ ఉన్నారని విమర్శించారు. కానీ, ప్రజలంతా కలిసి జగన్ ని ఫూల్ చేసేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు అన్నారు.
పుట్టిందే రాష్ట్ర విధ్వంసం కోసం అన్నట్లుగా జగన్ ఉన్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి చెడు ఆలోచనలు అంచనా వేయటం కష్టమేమో కానీ, ఆయన భవిష్యత్తు ఏంటో అంతా అంచనా వేస్తున్నారని చంద్రబాబు అన్నారు.(Chandrababu Naidu)
జగన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు:
”గతంలో ఏది మంచి ఏది చెడు అనే విశ్లేషణ ఉండేది. ఇప్పుడు ఎదురుదాడి తప్ప మరొకటి లేదు. ముందస్తుకు మేం సిద్ధంగా లేమని జగన్ భావిస్తే అది పగటి కలే. రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగానే ఉన్నాం. జగన్ ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది షాక్ ట్రీట్ మెంట్ మాత్రమే. వచ్చే ఎన్నికల్లో చేసేది శాశ్వత చికిత్స.(Chandrababu Naidu)
పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతులను కించపరిచారు. రేపు ఓడించారని ప్రజలకు శాపనార్థాలు పెడతారు. సజ్జల ఒకటంటే, బొత్స మరొకటి అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఫల్యం అంటున్న బొత్స.. రాజీనామా చేయొచ్చుగా?
ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారని బుద్ధున్న రాజకీయ ప్రత్యర్ధులు ఎవ్వరూ మమ్మల్ని అడగరు. మేం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో వారికి చెప్పాలా? 175 స్థానాల్లో వైసీపీని ఓడించటమే మా లక్ష్యం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకున్న 23 మంది బలంతోనే మా అభ్యర్థిని గెలిపించుకున్నాం.
మా పార్టీ నుంచి గాడిదలను తోలుకెళ్లిన్నట్లు తోలుకెళ్లి మాపైనే నిందలు వేయడం విడ్డూరం. తెలుగుదేశం పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేసి రావాలని జగన్ అసెంబ్లీలో అనలేదా? నీతిమాలిన పనులు చేస్తూ మాపై నిందలు వేస్తారా? ఎమ్మెల్యే కోటాలో మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ చేయటం అనైతికమనటం బుద్ధిలేనితనం కాక మరేంటి?” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.(Chandrababu Naidu)
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి షాక్ ఇవ్వగా, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ ఫలితాలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓటమి, టీడీపీ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.