Chandrababu
Chandrababu Visit Tirumala Temple : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారమే వారు తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తొలుత చంద్రబాబు దంపతులు వరాహా స్వామిని దర్శించుకున్నారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ… చంద్రబాబు దంపతులు వరహా స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయ్యి జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత తొలిసారి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఇదిలాఉంటే రేపు విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు.
తిరుపతి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్తారు. తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. ఈరోజు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈనేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు టీడీపీ ఎంపీలతో చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్ వేదికగా ఎండగట్టే విషయమై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలాఉంటే.. రేపు (శనివారం) విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకుంటారు. మరోవైపు చంద్రబాబుకు అడుగడుగునా ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : Revanth Reddy : ఎంత రాత్రి అయినా ఇవాళే వెల్లడించాలి- ఈసీకి రేవంత్ రెడ్డి డిమాండ్
చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, వ్యవసాయ సంక్షోభాన్ని పార్లమెంట్ ఉభయ సభల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్లో గళమెత్తేందుకు దాదాపు 13 అంశాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పెద్దఎత్తున ఓట్ల అక్రమాలకు తెరలేపిందనే అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు, ముఖ్యనేతలు సమన్వయం చేసుకునేలా ఈ సమావేశంలో ప్రణాళిక రూపొందించనున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలవల్ల ఏపిలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయన్న విషయంపై, మహిళలకు భద్రత లేకపోవడం, విభజన హామీలు అమలు కాకపోవడం వంటి విషయాలపై ఎంపీలు పార్లమెంట్లో గళమెత్తేలా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతోపాటు రాష్ట్రంలో ధరల స్థిరీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సక్రమ అమలు వంటి అంశాలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేలా ఎంపీలకు చంద్రబాబు సూచనలు చేయనున్నారు. ఈనెల 2వతేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు, లోకేష్లపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందనే అంశాన్ని వివిధ పార్టీల దృష్టికి తీసుకెళ్లాలని నేతలు యోచన చేస్తున్నారు.