TDP MLA Swamy: మూడేళ్లు ఏం చేశావ్.. సొంత పార్టీ నేతలే నిన్ను చీకొడుతున్నారు..
నియోజకవర్గంలో మాఫియా డాన్గా అశోక్ బాబు తయారయ్యాడు. పార్టీకోసం ప్రాణాలైన అర్పించాలని, అవసరమైతే ప్రాణాలు తీయాలంటూ వైసీపీ కార్యకర్తలకు అశోక్ బాబు ఉపదేశం చేస్తున్నాడని టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Published On : June 5, 2023 / 01:54 PM IST
TDP MLA Veeranjaneya Swamy
Prakasam District: ప్రకాశం జిల్లా (Prakasam District) నాయుడుపాలెం (NaiduPalem), టంగుటూర్ (Tangutur) ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ హయాంలో నిర్మించిన టాయిలెట్స్ నిర్మాణాల్లో ఎన్ఆర్జీసి నిధులలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ కొండపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు ఆరోపించారు. ఈక్రమంలో ఛలో నాయుడుపాలెంకు పిలుపు నిచ్చారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే స్వామి స్వగ్రామం నాయుడుపాలెంతో పాటు టంగుటూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి చేజారకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్ బాబును టంగుటూరులో తన నివాసంలో హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. ఎమ్మెల్యే స్వామిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా ఘటనపై కొండపీ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే స్వామి 10టీవీతో మాట్లాడారు. గత ఏడాది క్రితం మా ఇంటిమీదకు వచ్చి అశోక్ బాబు వైసీపీ ఇంచార్జి పదవి సాదించుకున్నాడని అన్నారు. తాను టాయిలెట్ల నిర్మాణాలలో అవినీతికి పాల్పడ్డానని ఆరోపిస్తున్న అశోక్ బాబు గతంలో ఇంచార్జిగా ఉన్న మూడేళ్లు, ఇప్పుడు ఎనిమిది నెలలు ఎందుకు మాట్లాడలేక పోయాడని ఎమ్మెల్యే స్వామి ప్రశ్నించారు. 2019 ఎన్నికల ప్రజాకోర్టులో నేను గెలిచి వచ్చానని గుర్తు చేశారు. మూడు సంవత్సరాల తర్వాత వచ్చి ఇప్పుడు ఆరోపణలు చేస్తుంటే ప్రజలు, నీ సొంత పార్టీ నేతలే నిన్ను ఛీకొడుతున్నారంటూ అశోక్ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టంగుటూరులో వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు మా టీడీపీ ర్యాలీకి మాత్రం అనుమతి ఇవ్వలేదని, పోలీసులు అంబెడ్కర్ రాజ్యాంగాన్ని అమలు పరచడంలేదు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటూ పోలీసుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నిరసన కార్యక్రమం ఓ వైపు జరుగుతుంటే వైసీపీ కక్షగట్టి టీడీపీ క్రీయాశీల ఎస్సీ సెల్ నేత అయిన శవనం సుధాకర్ భార్యను ట్రాక్టర్తో ఢీ కొట్టించి హత్య చేశారని, దీనిని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి అండ ఎవరు? ఆ పిల్లలకు దిక్కు ఎవరు? వీటన్నింటికి అశోక్బాబే కారణం, ఆయన భాద్యత వహించాలని ఎమ్మెల్యే స్వామి డిమాండ్ చేశారు.
Andhra Pradesh : టీడీపీలోకి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు …
నియోజకవర్గంలో మాఫియా డాన్గా అశోక్ బాబు తయారయ్యాడని, పార్టీకోసం ప్రాణాలైన అర్పించాలని, అవసరమైతే ప్రాణాలు తీయాలంటూ వైసీపీ కార్యకర్తలకు అశోక్ బాబు ఉపదేశం చేస్తున్నాడని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాన్ని అశాంతిగా మారుస్తున్నాడని విమర్శించారు. గతంలో ఇదే ఆరోపణలు చేసి దర్యాప్తు చేశారు ఏమైంది? వాటిలో తమకు క్లీన్ చిట్ వచ్చింది. కేసులు పెట్టమని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఏ విధంగా పెడతామంటూ పోలీసులు అంగీకరించ లేదని ఎమ్మెల్యే అన్నారు. తనపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఒక్క రూపాయి అవినీతి చేశానని సీఎం జగన్ నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా అని టీడీపీ ఎమ్మెల్యే స్వామి అన్నారు.
