Gone Prakash Rao - Chandrababu Arrest
Gone Prakash Rao – Chandrababu Arrest : మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిలపై ఆయన నిప్పులు చెరిగారు. అరెస్ట్ చేసి చంద్రబాబు నెత్తిపై జగన్ పాలు పోశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
” తాను జైలుకి వెళ్ళడానికి కారణమైన వారిని జైలుకి పంపాలని చంద్రబాబును జైలుకి పంపారు జగన్. ప్రైమాఫెసి ఉందని చంద్రబాబును అరెస్ట్ చేశామని సజ్జల చెప్పడం సిగ్గుచేటు. జగన్ శాడిస్టులా వ్యవహరిస్తున్నారు. అరెస్ట్ చేసి చంద్రబాబు నెత్తిపై పాలు పోశారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారు. ఈసారి 151 పైగా స్థానాల్లో టీడీపీ గెలుపొందుతుంది.
టీడీపీ కేడర్ భయపడాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్యం వచ్చాక అరెస్ట్ చేసిన వారిని భద్రత పేరుతో ఇంట్లో ఉంచిన పరిస్థితి లేదు. చంద్రబాబుకి జైల్లో పూర్తి రక్షణ ఉంటుంది. జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, చౌతాలా, రాజా అనేకమంది జైలుకెళ్లారు. ఎవరినీ ఇంటి వద్ద ఉండనివ్వ లేదు. చంద్రబాబు కుటుంబం భయపడాల్సిన అవసరం లేదు. జైలులో భద్రత ఉంటుంది. భద్రత పెంచాలంటే పిటిషన్ వేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుంది. ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. జగన్ ఎందుకు జైలుకి వెళ్లారో సజ్జల చెప్పాలి. సజ్జల ఒక బ్రోకర్” అని నిప్పులు చెరిగారు గోనె ప్రకాశ్ రావు.
జమిలి ఎన్నికల అంశంపైనా గోనె ప్రకాశ్ రావు స్పందించారు. ”దేశంలో జమిలి ఎన్నికలు జరగడం అసాధ్యం. తెలంగాణలో జనవరి 15 నాటికి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరపాల్సిందే. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం రాష్ట్రాలకు డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నా. జనవరి 15లోపే ఎన్నికలు జరుగుతాయి. మోడీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వాలు రద్దు చేసుకుని పార్లమెంట్ రద్దు చేసుకుని జమిలి ఎన్నికలకు వెళ్ళాలి. జమిలి ఎన్నికల నిర్వహణ పై ప్రధాని, అమిత్ షా కి లేఖ రాస్తా” అని గోనె ప్రకాశ్ రావు అన్నారు.