Papagni River Kamalapuram
Papagni River Bridge : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన వరద ప్రవాహానికి కుంగిపోయింది. దీంతో కడప-తాడిపత్రి జాతీయ రహదారిని మూసివేశారు. పాపాఘ్ని నదిపై నుంచి వెళ్లేందుకు వంతెన ఏకైక మార్గం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. తద్వారా పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్ళే ఉద్యోగస్తులు, ప్రజానీకం ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదం అని తెలిసినా రైల్వే వంతెనపై నుంచి కమలాపురం పట్టణానికి చేరుకుంటున్నారు.
ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు రైల్వే మార్గంపై ప్రయాణం ప్రమాదకరమని అటుగా వెళ్ళనివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఉన్న ఆ కాస్త మార్గం కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురై ఆగ్రహావేశాలను వెలిబుచ్చారు. స్పందించిన అధికారులు శనివారం పాపాఘ్ని నదిపై నడక దారికి ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసి ప్రజా రవాణాకు అడ్డంకులు తొలిగినా నడకదారి ఏర్పాటు చేస్తున్న ఫిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
పిల్లర్ల మద్య నుంచి నీటి ప్రవాహం వెళ్ళకుండా పూర్తిగా నదిలో కొట్టుకువచ్చిన చెట్లు అడ్డుగా ఉన్నాయి. నదిలో వరద ప్రవాహం పెరిగితే ఇప్పటికే దెబ్బతిని.. వంగి ఉన్న పిల్లర్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నడక దారి కూడా నరకమేనంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులు శాశ్వతమైన పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.