Tension In Amalapuram : అట్టుడుకుతున్న అమలాపురం.. మంత్రి క్యాంప్ ఆఫీస్, బస్సుకు నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి
అమలాపురం అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. స్కూల్ బస్సుకు నిప్పు పెట్టారు.
- Naveen
- Published On : May 24, 2022 / 06:37 PM IST
Tension In Amalapuram
Tension In Amalapuram : అమలాపురం అట్టుడుకుతోంది. అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా పేరును కోనసీమగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికుల చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది.
ఆందోళనకారులు మరింతగా రెచ్చిపోయారు. పోలీసులు, వారి వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఓ ప్రైవేట్ కాలేజీ బస్సుకు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. మంత్రి క్యాంప్ కార్యాలయం మంటల్లో తగలబడింది. ఎమ్మెల్యే ఇంటిపైనా దాడికి తెగబడ్డారు. దుండగుల రాళ్ల దాడిలో ఎస్పీకి సైతం గాయాలయ్యాయి. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. సుమారు 10వేల మంది ఆందోళనకారులు అమలాపురాన్ని చుట్టుముట్టారు. ఆందోళనకారులను తరలించేందుకు పోలీసులు కాలేజీ బస్సు తీసుకొచ్చారు. ఆ బస్సుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
కోససీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ జగన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ నిర్ణయమే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పేరు మార్చవద్దని, కోనసీమ జిల్లాగానే ఉంచాలని ఓ వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని టవర్ క్లాక్ సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లానే ముద్దు, వేరే పేరు వద్దు అంటూ నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకుని కలెక్టరేట్ వద్దకు పరుగులు తీశారు. వీరిని పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్పీ గన్ మెన్ గాయపడ్డారు. ప్రస్తుతం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
