×
Ad

AP Govt : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై దాడితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం..ప్రధాన రైల్వే స్టేషన్లకు హైఅలర్ట్‌

నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లకు భద్రత పెంచారు. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.

  • Published On : June 18, 2022 / 09:26 AM IST

Ap Govt

AP government : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌పై దాడితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలోనూ ఇలాంటి దాడులు జరిగే అవకాశముందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి. విశాఖ, గుంటూరు రైల్వే స్టేషన్లపై సంఘ విద్రోహ శక్తులు దాడి చేసే అవకాశముందని నిఘా వర్గాలు అలర్ట్‌ చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు ప్రత్యేక భద్రత కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన రైల్వే స్టేషన్లకు భద్రత పెంచారు. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల దగ్గర ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్మీ అధికారులు, డిఫెన్స్‌ అకాడమీ వారితో సంప్రదించినట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్‌, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు.

Heavy Security : విశాఖతో పాటుగా పలు రైల్వే స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం

విజయవాడ, తిరుపతి, కడప, విశాఖపట్నం, నెల్లూరు రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ పెంచారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వేస్టేషన్లలోనూ అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. అక్కడి పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ముందుజాగ్రత్తగా స్టేషన్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద రెండు ప్రవేశద్వారాలను మూసివేశారు.