వరకట్నం ఇవ్వలేదని : భర్తతో కలిసి తల్లిదండ్రులను చంపిన కూతురు
- bheemraj
- Published On : December 16, 2020 / 07:47 AM IST
daughter killed her parents along with her husband : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. వరకట్నం కోసం కన్న తల్లిదండ్రులనే హతమార్చిందో కూతురు. తన భర్తతో కలిసి కన్నవారి గొంతుకోసి చంపేసింది. మృతులను మత్తయ్య, సుగుణమ్మగా గుర్తించారు. 4 నెలల క్రితం బాబురావుతో మనీషాకు వివాహం జరిగింది. బాబురావు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నారు.
వివాహం అయినప్పటి నుంచి అల్లుడు, కూతురు కట్నం కోసం వేధిస్తోన్నారు. కట్నం ఇవ్వలేదని కూతురు మనీషా.. భర్త బాబురావుతో కలిసి రాత్రి ఒంటి గంట సమయంలో తల్లిదండ్రులను గొంతుకోసి చంపేసింది. మృతులు మత్తయ్య (70), సుగుణమ్మ(60)గా గుర్తించారు. అల్లుడు, కూతురు పరారీలో ఉన్నారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన కూతురు, అల్లుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
