Ap Ts (1)
Telugu states partition issues : తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం నియమించిన కమిటీ మొదటి సమావేశం కాబోతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ కమిటీ సమావేశం కానుంది. ఐదు అంశాలపై హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్, తెలంగాణ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, ఏపీ ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వర్చువల్గా భేటీ కానున్నారు.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల సెటిల్మెంట్, పన్నుల విషయంలో తలెత్తిన వివాదాల పరిష్కారం, బ్యాంకుల్లో వున్న నగదు డిపాజిట్ల విభజనతో పాటు ఏపీ, తెలంగాణ క్యాష్ క్రెడిట్ అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ త్రిసభ్య కమిటీ భేటీకి ముందే వివాదం రేగింది.
ఈ సమావేశం ఎజెండాలో తొలుత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు మొత్తం 9 అంశాలను పెట్టారు. దానితో ప్రత్యేకహోదా అంశం తెరపైకి వచ్చింది.కానీ వెంటనే అందులో నుంచి హోదా పాయింట్తో పాటు పన్ను రాయితీ లాంటి నాలుగు అంశాలను తొలగించింది. ఎజెండాలో మార్పు చేస్తూ కేంద్ర హోంశాఖ మరో సర్క్యులర్ జారీ చేసింది.
దీంతో ఇది రాజకీయ చర్చకు దారితీసింది. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏళ్లు గడుస్తున్నా.. కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమావేశంలో అయినా అవి కొలిక్కి వచ్చేనా అన్న చర్చ జరుగుతుంది.