Chandrababu Case – Criminal Lawyers : హేమాహేమీలైన సుప్రీంకోర్టు లాయర్లు చంద్రబాబు కేసులో రంగంలోకి దిగారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తరపున వాదించేందుకు ముగ్గురు ప్రముఖు లాయర్లు సిద్ధార్ధ లూథ్రా, హరీశ్ సాల్వే, సిద్ధార్ధ అగర్వాల్ రంగంలోకి దిగారు. ఏపీ సీఐడీ తరపును మరో ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ బరిలో నిలిచారు. వీళ్ల వాదనాపటిమ ఆధారంగా నిందితుల భవిష్యత్తు ఏంటనేది తేలుతుంది. న్యాయశాస్త్రంలో, వాదోపవాదాల్లో దిట్టలైన వీళ్ల ప్రత్యేకతలు తెలుసుకుందాం.
భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సిద్ధార్ధ లూథ్రా(Sidharth Luthra) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1990లో తన ఎల్ఎల్ బీ పూర్తి చేసి 1991లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి క్రిమినాలజీలో ఎంఫిల్ పట్టా పొందారు. 2015లో నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఆఫ్ లా ను ప్రదానం చేసింది. క్రిమినల్ లాయర్ గా వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలను డీల్ చేయడంతో లూథ్రా సిద్ధహస్తులు.(Chandrababu Case)
Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు అప్పట్లో పెద్ద సంచలనం. జూలై 2012లో లూథ్రా సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అమరావతి భూములు, ఓటుకు నోటు కేసుల్లో వాదించారు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సునీత తరపున వాదనలు వినిపించారు.
మరో ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే(Harish Salve).. ఈయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది. 1999 నుంచి 2002 వరకు ఇండియన్ సొలిసిటర్ జనరల్ గా పని చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూషణ్ జాదవ్ కేసుపై పోరాడారు. ఇంగ్లండ్ వేల్స్ కోర్టుకు క్వీన్స్ కౌన్సిల్ గా కూడా వ్యవహరించిన హరీశ్ సాల్వే మహారాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి ఎన్ కేపీ సాల్వే పేరొందిన చార్టెడ్ అకౌంటెంట్. ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా. ఆయన తాత ముత్తాతలు కూడా లాయర్లే.
నాగ్ పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన హరీశ్ సాల్వే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శరత్ అరవింద్ బాబ్డేకి సహ విద్యార్థి. కార్పొరేట్ వ్యవహారాలలో దిట్ట. మినర్వా మిల్స్ కేసులో పాల్కీవాలాకు సాయం చేశారు. సాల్వే కూడా అటార్నీ జనరల్ గా పని చేశారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి పెద్ద సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్ అల్లర్ల బాధితులు, బిల్కిస్ బానో తరపున సాల్వే వాదించారు.(Chandrababu Case)
Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?
ఇక మరో ప్రముఖ లాయర్ సిద్ధార్ధ అగర్వాల్(Siddharth Aggarwal). ఈయన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్. అనేక జాతీయ, అంతర్జాతీయ ట్రిబునల్స్ లో ప్రాక్టీసింగ్ లాయర్. వివిధ ఫోరమ్ లలో, రియల్ ఎస్టేట్ రంగంలో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లోని కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. క్రిమినల్ లా లో ఆయనది ప్రత్యేక నైపుణ్యం. చట్టాలపై అనుభవం ఉంది. దేశంలోని అత్యుత్తమ న్యాయవాదుల దగ్గర శిక్షణ పొందారు ఆయన. ఆగ్రా సెషన్స్ కోర్టు నుంచి న్యాయవాది వృత్తిని ప్రారంభించిన అగర్వాల్.. సుప్రీంకోర్టులో క్రిమినల్ లాయర్ గా ఎదిగారు. చట్టం అన్వయింపులకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించారు. సిద్ధార్ధ అగర్వాల్ కి క్రిమినల్ లా, పబ్లిక్ ఇంట్రస్ట్, కాంపిటిషన్ లా లో గొప్ప అభిరుచి ఉంది. ఆర్బిట్రేషన్ లా లో మంచి దిట్ట.
ఇక మరో ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ(Mukul Rohatgi). ఏపీ సీఐడీ తరపున ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ఇండియన్ అటార్నీ జనరల్ గా పని చేసిన వారే. ముంబై నుంచి న్యాయవాద వృత్తిని ప్రారంభించిన ముకుల్.. సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్. రోహత్గీ ముంబైలోనే ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్య పూర్తి చేశారు.
న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక సుప్రీంకోర్టుకు 36వ ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన యోగేశ్ కుమార్ సబర్వాల్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. దేశంలో 10మంది ప్రముఖ లాయర్లలో ముకుల్ కూడా ఒకరు. ఆయనను వాజ్ పేయి ప్రభుత్వం అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. అనేక సెలబ్రిటీల కేసుల్లో ఆయన వాదనలు వినిపించారు.
చట్టంలో దిట్టలైన ఈ నలుగురు న్యాయవాదులు ఇప్పుడు చంద్రబాబు కేసులో వాదనలు వినిపించనున్నారు. ఎవరికి ఎవరూ తీసిపోని వారే. ఎవరి వాదన నెగ్గుతుందో, ఎవరి వాదన వీగుతుందో చూడాలి.