TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు
TTD : సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేయనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
- Harishth Thanniru
- Published On : September 7, 2025 / 10:45 AM IST
TTD
TTD : సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడబోతోంది. ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3గంటల 28 నిమిషాలు ఉంటుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూసివేస్తున్నారు. గ్రహణం నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నారు.
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ మూసివేయనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. చంద్రగ్రహణం ముగిసిన తరువాత సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరుస్తారు. పుణ్యహవచనం, శుద్ది నిర్వహించిన తరువాత స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఆదివారం ఉదయం కంపార్ట్మెంట్లు షెడ్లలో వేచివున్న భక్తులకు మధ్యాహ్నం 1:30లోపు దర్శనంను పూర్తి చేసేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
గ్రహణ సమయంలో యాత్రిక సముదాయాలు, గదుల్లో ఉండే భక్తులకు పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్లు ప్యాకెట్లను టీటీడీ పంపిణీ చేయనుంది. భక్తులందరూ సోమవారం ఉదయం 6గంటలకు క్యూలైన్ లోకి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గ్రహణం కారణంగా పౌర్ణమి గరుడ సేవను రద్దు చేయడం జరిగిందని, అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయడం జరిగిందని టీటీడీ తెలిపింది.
