×
Ad

Srivari Quarterly Metlotsavam : రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. ఈ మెట్లోత్సవం మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనుకున్న టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో మెట్లోత్సవం నిర్వహించనున్నారు.

  • Published On : August 24, 2022 / 08:50 PM IST

Srivari Quarterly Metlotsavam

Srivari Quarterly Metlotsavam : టీటీడీ ఆధ్వర్యంలో రేపటి నుంచి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. ఈ మెట్లోత్సవం మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనుకున్న టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో మెట్లోత్సవం నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు జరుగుతాయి.

ఉదయం 8.30 నుంచి 12.30 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భజన మండళ్లు సంకీర్తనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు తెలియ‌జేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

TSRTC : తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసి గుడ్‌న్యూస్

మెట్లోత్సవం తొలి రోజున సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశాలు ఉంటాయి. మెట్లోత్సవం చివరి రోజున ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద మెట్లపూజ నిర్వహిస్తారు.

అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని దర్శించుకుంటారు. వేంకటాద్రి పర్వతాన్ని ఎందరో కాలినడకన అధిరోహించి స్వామి అనుగ్రహం పొందిన వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలనే తలంపుతో దాస సాహిత్య ప్రాజెక్టు ఈ మెట్లోత్సవం కార్యక్రమం చేపడుతోంది.