Tirumala Srivari Temple
Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమల (Tirumala) తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం టీటీడీ (TTD) మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా ఆలయంను మూసి ఉంచుతారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3గంటల వరకు సుమారు 12గంటల పాటు శ్రీవారి ఆలయంను మూసివేయనున్నారు.
ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సోమవారం వేకువజామున 1.31గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆనవాయితీగా ఆలయం తలుపులను టీటీడీ మూసివేయనుంది. సోమవారం తెల్లవారు జామున 3గంటలకు సుప్రభాతంతో ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి.
ఆలయం శుద్ధి, పుణ్యహవచనం అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 6గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణను నిలిపివేయనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపిణి పున: ప్రారంభం అవుతుంది.