sri venkateswara swamy Brahmotsavam
sri venkateswara swamy Brahmotsavam 2023 : టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. శ్రీవారి ఆలయం వద్ద పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వివరించారు.
సెప్టెంబరు 18వ తేదిన జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీవారికి సియం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తామని.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు వసతులతో పాటు వారి భద్రతపై అన్ని రకాల చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారం
టీటీడీ పాలక మండలి నూతన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆర్ వెంకట సుబ్బారెడ్డి, బాల సుబ్రమనియన్ పలనిసామి, సిద్దవటం యానాదయ్య, ఎల్లారెడ్డి గారి సీతారామ రెడ్డి, సిద్ద వీర వెంకట సుధీర్ కుమార్ లు పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఈరోజు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఈరోజు శ్రీవారిని దర్శించుకున్నారు.