Tirumala Srivari Break Darshan : డిసెంబరు 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయం మార్పు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తామని ఈవో తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు.
- bheemraj
- Published On : October 28, 2022 / 09:06 PM IST
Tirumala Srivari break darshan
Tirumala Srivari break darshan : టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్థం నవంబరు ఒకటో తేదీ నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12న తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు.
భక్తుల విజ్ఞప్తి మేరకు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల రెండో సత్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 20 వేల నుండి 25 వేల టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఏరోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లు అదేరోజు మంజూరు చేస్తామని వెల్లడించారు.
Seat Belts: నవంబర్ 1 నుంచి సీట్ బెల్టు తప్పనిసరి.. ఆదేశాలు జారీ చేసిన ముంబై పోలీసులు
కోటా పూర్తవ్వగానే కౌంటర్లు మూసివేస్తామని తెలిపారు. ఈ కౌంటర్లలో కంప్యూటర్లు, కెమెరాలు, ఆధార్ నమోదు వ్యవస్థ, తాగు నీరు, క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామని తెలిపారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్పు చేయనున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తామని ఈవో తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈవో పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆఫ్ లైన్ టికెట్లు కూడా మాధవంలోనే మంజూరు చేస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో డిప్యూటి ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు.
