TTD EO AV Dharma Reddy: ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా.. సేంద్రియ సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం రాయలసీమ జిల్లాలకు చెందిన సేంద్రియ రైతులతో ఈవో సమావేశం నిర్వహించారు.
- Harishth Thanniru
- Published On : September 13, 2022 / 07:06 PM IST
TTD EO Dharma Reddy
TTD EO AV Dharma Reddy: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం రాయలసీమ జిల్లాలకు చెందిన సేంద్రియ రైతులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. సేంద్రియ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గోవిందునికి గో అధారిత నైవేద్యంను టీటీడీ గత ఏడాది నుండి సేంద్రీయ వ్యవసాయంతో పండించిన పంటతో సమర్పించడం ప్రారంభించిందని అన్నారు. అనతికాలంలోనే దీనికి భక్తుల నుండి విశేష ఆదరణ లభించిందని ధర్మారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలతో భక్తులకు కూడా అన్నప్రసాద వితరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా వారికి మరింత రుచికరమైన ఆహారాన్ని అందించడమేగాక ఆరోగ్య కరమైన ఆహారాన్ని అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
వ్యాధి రహిత సమాజాన్ని నెలకొల్పడానికి, సహజ వ్యవసాయ పద్ధతులతో పండించిన కూరగాయలతో తయారుచేసిన రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకోవాలని, ఇది సేంద్రీయ రైతుల సహకారంతో మాత్రమే సాధ్యమవుతుందని టీటీడీ ఈవో చెప్పారు. రైతులు మరింతగా దృష్టి కేంద్రీకరించి, సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించి కూరగాయలను పండించాలని కోరారు. వారు పండించిన కూరగాయల పంటల కొనుగోలుకు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క దాతను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
Girl Saved: బాబోయ్..! క్షణం ఆలస్యమైనా చిన్నారి ఊపిరి ఆగేది.. ఈ వీడియోను చూస్తే చెమటలు పట్టాల్సిందే..
సేంద్రియ రైతులు మరింత మంది ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రొత్సహించి జాబితా రూపొందించాలన్నారు. అయితే టీటీడీ రవాణా, సామీప్యత, నిల్వ పరిమితులను దృష్ఠిలో ఉంచుకొని తిరుపతి, చిత్తూరు జిల్లాల నుండి వచ్చిన సహజ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రోజువారీ కూరగాయల అవసరాల ఆధారంగా అన్నమయ్య, కడప, నెల్లూరు, కర్నూలు మొదలైన ఇతర జిల్లాలను కూడా దశలవారీగా కలుపుతామని టీటీడీ ఈవో చెప్పారు.
