Railway Corridors: ఏపీ రైల్వే నెట్వర్క్కు గుడ్ న్యూస్.. విశాఖ, విజయవాడ మీదుగా 4 రైల్వే లైన్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రధాన రైల్వే (Railway Corridors)మార్గాలను ఆధునీకరించడంతో పాటు సరుకు, ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
- V Santhosh Kumar
- Published on- September 9, 2026 / 04:30 PM IST
Union Cabinet approves four-lane railway corridors in Andhra Pradesh.
- కేంద్ర కేబినెట్ రైల్వే నిర్ణయాలు
- ఏపీలో నాలుగు లైన్ల విస్తరణ
- పెరుగుతున్న రవాణా రైళ్ల వేగం
Railway Corridors: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సెప్టెంబర్ 9 జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రైల్వే మార్గాలను ఆధునీకరించడంతో పాటు సరుకు, ప్రయాణికుల రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు పలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా ఏడు కీలక రైల్వే కారిడార్లలో(Railway Corridors) నాలుగు లేన్ల ట్రాక్ల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాలకు భారీ లబ్ధి.. విశాఖ, విజయవాడ మీదుగా విస్తరణ:
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో దక్షిణ భారత రైల్వే నెట్వర్క్తో పాటు ఆంధ్రప్రదేశ్కు అపార ప్రయోజనం చేకూరనుంది. హౌరా-చెన్నై రైల్వే కారిడార్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేయనున్నారు. అలాగే ముంబై-చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లైన్ల విస్తరణ పనులు చేపట్టనుండటంతో రైళ్ల వేగం పెరగడంతో పాటు ప్రయాణికుల నిరీక్షణ సమయం తగ్గనుంది.
రవాణా విప్లవం.. పోర్టులు, పారిశ్రామిక నగరాలకు మహర్దశ:
ప్రస్తుతం ట్రాఫిక్ ఒత్తిడితో సతమతమవుతున్న ప్రధాన మార్గాల్లో అదనపు లైన్ల నిర్మాణం ద్వారా రైళ్ల రాకపోకలకు ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, గుంతకల్లు, రేణిగుంట వంటి జంక్షన్ల నుంచి పారిశ్రామిక ప్రాంతాలను, ప్రధాన పోర్టులను సులువుగా అనుసంధానించేందుకు ఈ కారిడార్లు కీలకంగా మారనున్నాయి. ఈ విస్తరణతో రాబోయే రోజుల్లో ఏపీ రవాణా రంగానికి కొత్త ఊపు రానుంది.
