AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనపై శాఖాపరమైన చర్యలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈమేరకు మంగళవారం లేఖ రాసింది. ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్ అయ్యే వరకు వచ్చే ఇంక్రిమెంట్లను రద్దు చేయాలని సిఫారసు చేసింది. యూపీఎస్సీ సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వైఎస్ జగన్ సర్కారు మూడేళ్ల క్రితం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వెంకటేశ్వరరావుపై కేసు కూడా పెట్టింది.
Also Read: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. చంద్రబాబు పాత్రపై కేఏ పాల్ అనుమానాలు
కాగా, తనను ప్రభుత్వం విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకుంది. మళ్లీ కొన్ని రోజులపై ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్ సర్కారుపై న్యాయపోరాటం చేస్తున్న వెంకటేశ్వరరావుకు తాజాగా కేంద్రం ఝలక్ ఇచ్చింది.