Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ ఏపీలో పొలిటికల్ ట్విస్ట్లు..!
వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 35 మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ అధికారపక్ష అభ్యర్థికి పడే అవకాశం ఉంది.
- T Venkateshwarlu
- Published On : August 23, 2025 / 08:57 PM IST
Chandrababu-Jagan
Vice President Election: నేషనల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్ ఉన్న వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల తెలుగు స్టేట్స్లోనూ కాక రేపుతోంది. ఇలా పొలిటికల్ హీట్ క్రియేట్ చేయడానికి..ఇండియా కూటమి నుంచి తెలుగు వారైన జస్టిస్ సుదర్శన్రెడ్డి బరిలో ఉండటం ఒక కారణమైతే. ఏపీలో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం ఇంకో రీజన్గా మారింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు వైసీపీ మద్దతు తెలపడంపై ఓ రేంజ్లో సైటైర్లు వేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.
వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని, లోపనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని షర్మిల ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి, బీజేపీకి జగన్ బీ-టీమ్గా వ్యవహరిస్తున్నారన్న షర్మిల..బీజేపీ కోసమే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ పనిచేస్తున్నాయని ఫైరయ్యారు. ఇక షర్మిల కామెంట్స్ అలా ఉంటే.. ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలవడం చర్చకు దారితీసింది.
ఆయన ఖర్గేను కలిసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో మేడా రఘునాథ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్కు మద్దతిస్తూ వైసీపీ నిర్ణయం ప్రకటించిన వేళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ను అదే పార్టీ ఎంపీ కలవడంతో జంపింగ్కు రెడీ అయ్యారన్న టాక్ బయలుదేరింది.
గత ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ తరఫున మేడా రఘునాథ్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం మరో ఐదేళ్లు ఉంది. ఇలాంటి సమయంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవడంతో ఏపీ పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీకి పార్లమెంట్లో ఉన్న మొత్తం 11 మంది ఎంపీల్లో నలుగురు పార్టీని వీడారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయిరెడ్డి ఉన్నారు. మరో ఎంపీ మిథున్ రెడ్డి మద్యం స్కాం కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నారు.
అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా?
ఇక వివేకా హత్య కేసులో మరో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రేపోమాపో బెయిల్ రద్దు అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఐదుగురు ఎంపీల్లో ఒకరైన మేడా రఘునాథ్ రెడ్డి ఇలా కాంగ్రెస్ బాస్ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే తాను వైసీపీని వీడటం లేదని..మల్లికార్జున ఖర్గే తనకు అత్యంత దగ్గరి స్నేహితుడని చెప్తున్నారు మేడా రఘునాథ్రెడ్డి. తాను వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కొత్తది కాదని..తాను ఫ్యాన్ పార్టీలోనే ఉంటానన్నట్లుగా కామెంట్స్ చేశారు.
అయితే ఫ్రెండ్గానే కలిసినా..ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మేడా రఘునాథ్రెడ్డి ఖర్గేను కలవడం అయితే సమ్ థింగ్ దేర్ అన్న గుసగుసలకు దారి తీసింది. (Vice President Election)
ఇక ఇండియా కూటమి నుంచి తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్రెడ్డిని బరిలోకి దించారు. ఆయన తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి రాజకీయాలు అతీతంగా అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబును కలిసి కూడా మద్దతు ఇవ్వుమని అడుగామని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్తుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరినైనా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది. కాకపోతే చంద్రబాబు ఆల్రేడీ ఎన్టీయే కూటమిలో ఉన్నారు.
బాబు నిక్కచ్చిగా చెప్పేశారా?
ఇప్పటికే తన మద్దతును ప్రకటించారు. అయినా ఆయన మద్దతు కోరడం అయ్యే పని కాదన్న చర్చ ఉంది. సుదర్శన్రెడ్డి పేరును ఎన్డీఏ ప్రతిపాదిస్తే కచ్చితంగా తాము కూడా ఓటేస్తామని అన్నారు. అంటే ఎన్డీఏ నిలబెడితేనే ఓటు వేస్తాం తప్ప ప్రాంతీయ సమీకరణలను తెలుగు కార్డుని చూసుకుని తాము మద్దతు ఇచ్చేది ఉండదని బాబు నిక్కచ్చిగా చెప్పేశారు అని అంటున్నారు.
పైగా ఇండియా కూటమి ఓటమి చెందుతామని తెలిసి తెలుగు అభ్యర్ధిని నిలబెట్టిందని ఆయన తప్పుపట్టారు. జగన్ ఎన్డీఏ మద్దతు తెలపడంపై కూడా బాబు తనదైన శైలిలో స్పందించారు. తాము ఎన్డీఏ మిత్రులం కాబట్టి తమది ఎన్డీఏ క్యాండిడేట్కే సపోర్ట్ చేస్తామని..జగన్ ఎందుకు ఎన్డీఏకు మద్దతు ఇచ్చారో ఆయన్నే అడగాలంటూ బాబు అనడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 35 మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ అధికారపక్ష అభ్యర్థికి పడే అవకాశం ఉంది. అయితే తెలుగు సెంటిమెంట్ తెరపైకి తెచ్చి ఏపీ ఎంపీలపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. అయితే ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జనసేన తమ కూటమి అభ్యర్థినే బలపరిచాయి. వైసీపీ కూడా ఎన్డీఏకు జైకొట్టింది. దాంతో అందరి ఓట్లు అటువైపే అన్నట్లుగా..ఏపీ రాజకీయం ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల చుట్టూ తిరుగుతోంది.
