Weather Alert
Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 840 కిమీ దూరంలో ఉండగా గంటకు 18 కిమీ వేగంగా కదులుతూ ఉత్తర తమిళనాడు వైపు దూసుకొస్తోంది. ఉత్తర తమిళనాడు వద్దే తీరం దాటే అవకాశం ఉండగా.. ఈ సమయంలో గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో దక్షణ కోస్తా.. రాయలసీమలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించగా.. వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాగా.. వర్షాకాలంలో అల్పపీడనం, వాయుగుండాలు ఏర్పడడం.. అవి తీవ్ర తుఫాన్లుగా మారడం సహజం. అయితే.. వేసవిలో తీవ్ర వాయుగుండం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. గత 200 ఏళ్లలో కేవలం 11 సార్లు మాత్రమే ఇలా మార్చి నెలలో తీవ్ర వాయుగుండాలు ఏర్పడ్డాయి.