Dhulipalla Narendra Kumar
Dhulipalla Narendra Fired Jagan : సీఎం జగన్ నేడు అమూల్ డైరీకి శంకుస్థాపన చేసి చిత్తూరు డైరీకి శంకుస్థాపన చేసినంత బిల్డప్ ఇచ్చారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా అమూల్ కి చోటు లేదన్నారు. ఉత్తరాది రాష్ట్ర డైరీ అయిన అమూల్ ని ఎందుకు సీఎం జగన్ ఏపీలో ప్రమోట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్ ని తీసుకువచ్చారని నిలదీశారు.
చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీజ డైరీ సీఎం జగన్ కి కనపడలేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అమూల్ డైరీపై పెట్టే శ్రద్ధ మహిళా శక్తితో నడుస్తున్న శ్రీజ డైరీపై పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పెద్దిరెడ్డి ఇలాఖాలో అమూల్ డైరీ ఎందుకు పాల సేకరణ జరపడం లేదని నిలదీశారు. ఎన్నికల ముందు ఒకమాట ఎన్నికల తర్వాత మరోమాట చెప్పడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
హెరిటేజ్ మూలానా సహకార డైరీలు మూతపడ్డాయని సీఎం జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో హెరిటేజ్ పై హౌస్ కమిటీ వేసి ఏమి తేల్చలేదని చెప్పారు. చంద్రబాబు, హెరిటేజ్ పై పడి ఎన్ని రోజులు ఏడుస్తారని మండిపడ్డారు. కళ్ళు మూసుకున్నా తెరిచినా సీఎం జగన్ కు చంద్రబాబు మాత్రమే కనిపిస్తున్నారని వెల్లడించారు. ఆ భయంతోనే చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.