MLC election Results: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల వావా..
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. నాలుగు స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
- Harishth Thanniru
- Published On : March 16, 2023 / 10:37 AM IST
MLC Elections
MLC election Results: ఏపీలో ఈనెల 13న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థులు సత్తాచాటారు. రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ విజయం సాధించారు. కవురు శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రకు 460 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి. వైకాపా అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం 752 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోగా వైసీపీ అభ్యర్థి రామారావుకు 632 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అనేపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లుబాటుకాలేదు.
అదేవిధంగా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. 988 ఓట్లు మెజార్టీతో విజయం సాధించాడు. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 1083 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ పూర్తిస్థాయి మెజార్టీ సాధించడంతో ఎన్నికల అధికారులు ఆయన్ను విజేతగా ప్రకటించారు.
