Pawan Kalyan Vs YCP : పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ కాపు లీడర్స్.. ఏపీ రాజకీయాల్లో పెరిగిన హీట్
వారాహి విజయయాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కాపు నాయకులు దీటుగా స్సందిస్తున్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : June 21, 2023 / 03:19 PM IST
Pawan Kalyan Vs YCP Kapu Leaders
Pawan Kalyan Vs YCP Kapu Leaders: ఇప్పటికే ఉన్న పొలిటికల్ హీట్ (Political Heat) చాలదన్నట్లు.. ఏపీ రాజకీయాల్లో కాపు ఫ్యాక్టర్ మరింత కాకరేపుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ కాపు నేతలన్నట్లుగా మారింది రాజకీయం. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా.. కాపు లీడర్ అయిన పవన్కి.. కాపు నాయకులతోనే బదులిప్పించాలని అధికార వైసీపీ (YCP) డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాపు నేతలంతా వరుసగా పవన్ కల్యాణ్ని టార్గెట్గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో.. ఏపీ రాజకీయాల్లో (AP Politics) హీట్ మరింత పెరిగిపోయింది.
ఈ మధ్య పవన్ కల్యాణ్ స్పీచ్ల్లో కాపుల ప్రస్తావన తరచుగా వస్తోంది. పైగా.. ఇప్పుడు కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఆయన వారాహి యాత్ర (varahi vijaya yatra) కొనసాగుతోంది. దాంతో.. పవన్ కల్యాణ్ కాపుల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. అధికార వైసీపీలో ఉన్న కాపు నాయకులను టార్గెట్ చేస్తున్నారు. కాపులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. దాంతో.. అధికార వైసీపీ కూడా పవన్ని అంతే దీటుగా కౌంటర్ ఇచ్చేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది. కాపు నేతలే టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్న పవన్కి.. ఆ కాపు నేతలతోనే కౌంటర్ ఇప్పిస్తోంది వైసీపీ అధినాయకత్వం.
పవన్ ఎందుకు రాలేదో..?
పవన్ కల్యాణ్ టార్గెట్గా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) రాసిన బహిరంగ లేఖలో.. కాక రేపే విషయాలను ప్రస్తావించారు. కాపుల ఉద్యమానికి పవన్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. తాను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని, యువతను ఉపయోగించుకుని పబ్బం గడుపుకోలేదని అన్నారు ముద్రగడ. కోట్లకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదన్నారు. తాను వదిలేసిన ఉద్యమాన్ని పవన్ చేపట్టి.. యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తుందనడం తప్పన్నారు ముద్రగడ. కాపుల ఉద్యమానికి సాయం చేసిన వారిని విమర్శించడం సరికాదన్నారు. జనసేన 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి.. సీఎంని చేయాలని కోరాలి తప్ప.. కలిసి పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయమనడం.. హ్యాస్పాస్పదంగా ఉందన్నారు.
చంద్రబాబు చెప్పిందే.. చెబుతున్నారు
వారాహి యాత్రలో పవన్ చెప్పే మాటలు వింటుంటే చులకనవుతోందని.. సాటి కులస్తునిగా బాధపడుతున్నానని.. మంత్రి కొట్టు సత్యనారాయణ (kottu satyanarayana) అన్నారు. సీఎం అవడానికి అంగీకరిస్తున్నానని పవన్ తింగరి మాటలు మాట్లాడుతుంటే.. కాపులు బాధపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పిందే.. పవన్ చెబుతున్నారన్నారు డిప్యూటీ సీఎం సత్యనారాయణ. వారాహి యాత్రలో 2, 3 వేల మంది జనం ఉన్న సభ ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు.
జగన్కి 90 శాతం కాపుల మద్దతు
మాజీ మంత్రి, కాపు నేత కన్నబాబు (Kannababu) కూడా పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు. అభిమానులను అలరించడానికే.. పవన్ వారాహి యాత్ర చేస్తున్నారన్నారు. అకేషనల్గా రాజకీయాలు చేస్తున్నారని.. సభ్యత లేని భాషతో చంద్రశేఖర్ రెడ్డిపై మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్.. ద్వారంపూడిపై పోటీ చేయాలన్నారు. ముద్రగడను పరామర్శించడానికొస్తే.. చిరంజీవిని టీడీపీ ప్రభుత్వం ఎయిర్పోర్టులో నిర్బంధించిందని గుర్తు చేశారు కన్నబాబు. 90 శాతం కాపులు.. జగన్కి మద్దతు తెలుపుతున్నారన్నారు.
ఏం సందేశమిస్తున్నారు?
ఎంపీ గీత కూడా పవన్ తీరుని తప్పుబట్టారు. సీఎం జగన్, ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. తామంతా.. ప్రజాక్షేత్రంలో గెలిచి ఈ స్థాయికి వచ్చిన వాళ్లమన్నారు. యువతకు.. పవన్ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. పవన్ వ్యవహారశైలి ఏమాత్రం హర్షణీయం కాదన్నారు.
Also Read: చంద్రబాబుపై సోము వీర్రాజు ఆగ్రహం.. మాది గల్లీ పార్టీ కాదు.. పద్దతి మార్చుకో..
జగన్తో లాలూచీపడ్డారా?
ఇదిలా ఉంటే.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకి.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న (buddha venkanna) బహిరంగ లేఖ రాశారు. కాపులకు జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోయినా.. ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్తో లాలూచీపడ్డారా? లేక భయపడుతున్నారా? అని క్వశ్చన్ చేశారు. కాపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబును విమర్శిస్తే.. బీసీలుగా తాము చూస్తూ ఊరుకోమన్నారు. ఇకపై ముద్రగడ రాసే ప్రతి లేఖకు బదులిస్తామన్నారు బుద్ధా వెంకన్న. ఎదుటివారిని ప్రశ్నించే ముందు.. కాపులకు జగన్ ఏం చేశారో వివరించాలని చెప్పారు.
Also Read: ఎమ్మెల్యే.. నీపని నువ్వు చేసుకో.. ఆ విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్
మొన్నటిదాకా.. పవన్ కాపుల ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ.. వైసీపీ నుంచి కౌంటర్గా పేర్ని నాని స్క్రీన్ మీదకు వచ్చేవారు. ఇప్పుడు.. మిగతా కాపు నేతలను కూడా వైసీపీ సీన్లోకి దించుతోంది. ఇందులో భాగంగానే.. పవన్కు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. దాంతో.. ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న కాక.. డబులైందని చెప్పొచ్చు.
