YS Jagan
YS Jagan: అమెరికా న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కొందరు పాల్గొన్న విషయం తెలిసిందే. అలాగే, పలు సంస్థలనూ వారు సందర్శించారు. అమెరికాలో పర్యటించి వచ్చిన ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఇవాళ అమరావతిలో సీఎం జగన్ ను కలిసింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జగన్ తో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం ఎలా ఉంది? అని అడిగారు. ‘మనం ఎలా నిలబడాలి అన్నదానిమీద మీకు కొన్ని అనుభవాలు ఈపర్యటన ద్వారా వచ్చి ఉంటాయని భావిస్తున్నాను. ప్రపంచంతో పోటీపడితేనే మన బతుకులు మారుతాయి. దానికి విద్యే ఆధారం.
మీరు చూసిన కొలంబియా యూనివర్సిటీ లాంటి చోట్ల 21 కోర్సులు ఇచ్చే అన్ని ప్రఖ్యాత ప్రపంచ కాలేజీల్లో కూడా మీకు ఎక్కడ సీటు వచ్చినా ఉచితంగా చదివిస్తాం. విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద మీకు సీటు వస్తే చాలు రూ.1.2 కోట్ల వరకూ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది’ అని చెప్పారు.
‘మీకు ఎలాంటి సబ్జెక్టుమీద శ్రద్ధ ఉందో గమనించుకుని, సంబంధిత ప్రపంచస్థాయి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? అందులో సీటు కావాలంటే ఏరకంగా సన్నద్ధం కావాలన్న విషయాల్లో మీ ఆలోచనల్లో ఉండాలి’ అని జగన్ చెప్పారు. జీఆర్ఈ, జీ మ్యాట్ లాంటి పరీక్షలు కూడా ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు జగన్ సూచించారు.
ప్రతి విద్యార్థిని చేయిపట్టి నడిపించడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడం అన్నది ఈ పిల్లల లక్ష్యం కావాలని అన్నారు. మన పాఠ్యప్రణాళికలోలేని సబ్జెక్టులను మనం తీసుకువస్తున్నామని చెప్పారు. ఎంఐటీ, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీ నిపుణులతో తయారు చేసిన సబ్జెక్టులను ఇందులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఎడెక్స్తో దీనికి సంబంధించి ఇప్పటికే ఒప్పందం చేసుకుందని తెలిపారు.