Ys Vijayamma : తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండటం నా ధర్మం.. నా సమక్షంలోనే ఆస్తుల పంపకం జరిగింది : విజయమ్మ బహిరంగ లేఖ
Ys Vijayamma : అసలు వాస్తవాలు ఇవే... ఎంతైనా వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అది వాళ్ళిద్దరి సమస్య. వారి సమస్యను వారే పరిష్కరించుకుంటారు. అదే రాజశేఖర్ ఉండి ఉంటే.. ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు.

Ys Vijayamma Sensational Letter Over Property Disputes
Ys Vijayamma : వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదంపై తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్ఆర్ అభిమానులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. ‘‘రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి హృదయానికీ, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాధేస్తోంది. రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు.. చాలా సంతోషంగా ఉండేవాళ్లం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా, జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరుగుతున్నాయి.
ఈ వైఎస్సార్ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతోంది. తెలిసి కొంత.. తెలియక కొంత మాట్లాడుతున్నారు. అవి దావానలంలా ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వొద్దు. నా పిల్లలిద్దరికే కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఈ విషయంపై నేను మీ ముందుకు రాకూడదని అనుకున్నా. కానీ, రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా… ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు.. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఆయనకు మేమెంతో.. మీరూ అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో.. మిమ్మల్ని అంతగానే ప్రేమించారు. మీరూ అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు.
రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక నా పిల్లలను ఆయన ఉన్నప్పటి కన్నా ఎక్కువగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేనెప్పటికీ మరిచిపోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ.. హృదయ పూర్వకంగా నా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులెత్తి మనవి చేసుకుంటున్నా. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరుతున్నా.. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయొద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం పట్ల నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. మీరెవరూ రెచ్చగొట్టవద్దని నా మనవి’’ అని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.
విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి చెప్పేవి అసత్యాలు :
‘‘విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతున్నది అసత్యాలే.. వాళ్లు మాట్లాడుతున్నది వాళ్లు ప్రేమించే వైఎస్ఆర్ గురించేనని మరిచారు. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అనే స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్సార్ బతికి ఉండగానే ఆస్తులు పంచేశారని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్ఆర్ పిల్లలిద్దరూ పెరుగుతున్న రోజుల నుంచి కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ముమ్మాటికీ ఆస్తులు పంచడం కాదు. వైఎస్ఆర్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు. అలాగే, జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు.
అంతే.. విజయసాయి రెడ్డి ఆడిటర్గా ఉన్నారు గనక ఆయనకు అన్నీ తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా ఎంవోయూపై సాక్షి సంతకం చేశారు. అయినా.. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెబుతున్నా. వీరిద్దరూ నా పిల్లలు. వైఎస్ఆర్, నేను ఇద్దరినీ ఎంతో అపురూపంగా, ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. రాజశేఖర్ రెడ్డి మాట ప్రకారం.. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమే. ఇదే నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ ఆజ్ఞ నిజం. అస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ, అన్ని ఆస్తులూ కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత కలిగిన కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం.
జగన్ వైఎస్ఆర్కు ఇచ్చిన మాట ఇదే.. :
వైఎస్ఆర్ చివరి రోజుల్లో ఆయనకు జగన్ ఇచ్చిన మాట ‘‘నాన్నా.. నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని’’ అని చెప్పింది నిజం. ‘‘నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకం’’లో ఎప్పుడో రాశా. వైఎస్సార్ బతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసే ఉన్నాం. అన్నీ కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి.. ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్గా విజయసాయిరెడ్డికి స్పష్టంగా తెలుసు. తెలిసీ కూడా అవాస్తవాలు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక.. 2009 నుంచి 2019 వరకు 10ఏళ్లు కలిసే ఉన్నారు.

Ys Vijayamma Sensational Letter
డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, రూ.200 కోట్లు షర్మిల భాగానికి ఇచ్చారు. ఎంవోయూ ప్రకారం.. జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే.. ఎంవోయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి. వీటన్నింటికీ అప్పుడు, ఇప్పుడూ నేనే సాక్షిని. 2019లో జగన్ సీఎం అయిన 2 నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్లో జగన్ ప్రపోజల్ పెట్టాడు. జగన్ చెప్పింది ఏంటంటే… ‘‘పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్లు వస్తారు. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి విడిపోదాం’’ అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తులు పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది’’ అని విజయమ్మ లేఖలో అనేక విషయాలను వివరించారు.
నా సమక్షంలోనే ఆస్తుల పంపకం జరిగింది.. :
విజయవాడలో నా సమక్షంలోనే ఆస్తుల పంపకం జరిగింది. ఇద్దరికి ఎంత అనేది జగన్, షర్మిల అనుకున్నారు. 2019లో రాసిన ఎంవోయూనే ఇది. జగన్ నోటితో చెప్పిన ఆయన చేతితో రాసిన ఎంవోయూనే ఇది. షర్మిలకి హక్కు ఉంది. అందుకే రూ.200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. షర్మిలకు హక్కు ఉంది కాబట్టే అధికారికంగా ఎంవోయూ రాసుకున్నారు. షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యతగా ఇస్తున్నవి. అటాచ్మెంట్లో లేవని.. ఎంవోయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, ఎలహంక ప్రాపర్టీ 100 శాతం షర్మిలకు వెంటనే ఇస్తాను అని జగన్ మాట ఇచ్చి సంతకం కూడా పెట్టాడు. అవి కూడా ఇవ్వకుండా.. అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా షర్మిలకు అన్యాయం జరిగింది. షర్మిల భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు.. ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది.
తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉంటాను :
2019 వరకు కలిసే ఉన్నాం. షర్మిలను బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదు. రాష్ట్ర రాజకీయాల్లో జగన్ చెప్పినట్లుగానే షర్మిల చేసింది. అన్న జగన్ కోసం నిస్వార్ధంగా పనిచేసింది. అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేసింది. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే.. చూస్తూ తట్టుకోవడం కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన మాట్లాడటం నా ధర్మం. కొంతమంది పెద్ద మనుషులు చెబుతున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది.
అసలు వాస్తవాలు ఇవే… ఎంతైనా వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అది వాళ్ళిద్దరి సమస్య. వారి సమస్యను వారే పరిష్కరించుకుంటారు. అదే రాజశేఖర్ ఉండి ఉంటే.. ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటివరకు వచ్చేది కాదు.. ఆస్తుల విషయంపై నేనూ ఇలా రావాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రస్తుతం జరుగుతున్న రచ్చను చూసి.. నా మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తున్నా. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని మరోసారి మీ అడబిడ్డగా ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా.. ఇట్లు, ప్రేమతో, వైఎస్ విజయమ్మ, రాజశేఖర్ రెడ్డి’’ అని లేఖలో తెలిపారు.