YS Viveka Case
YS Viveka Case : మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముగిసింది. 8 గంటలకుపైగా ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించింది. వివేకా హత్యపైన సుదీర్ఘంగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రేపు(ఏప్రిల్ 21) కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అవినాశ్ రెడ్డి విచారణను సీబీఐ అధికారులు వీడియోగ్రఫీ చేశారు.
ఇటు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను 5గంటల పాటు ప్రశ్నించింది సీబీఐ. అనంతరం నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు. ప్రధానంగా రూ.40 కోట్ల డీల్, గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రచారం చేశారని? సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
Also Read..Achchennaidu : వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు : అచ్చెన్నాయుడు
కొత్త నియమించిన ఆఫీసర్ వికాస్ సింగ్ నేతృత్వంలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే వైఎస్ వివేకా కేసులో ఇటీవలి కాలంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉదయ్ కుమార్, అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. కోర్టు వారిని 6 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ(ఏప్రిల్ 20) రెండో రోజు కస్టడీ విచారణలో భాగంగా నిందితులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను చంచల్ గూడ నుంచి సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. దాదాపు 5గంటలకు పైగా వారిద్దరిని విచారించి వారి స్టేట్ మెంట్ కూడా నమోదు చేశారు.
అటు, వరుసగా రెండో రోజు కూడా ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. దాదాపు 8గంటల పాటు సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాశ్ రెడ్డి పాత్రకు సంబంధించిన దానిపైనే ఎక్కువగా సీబీఐ అధికారులు ఈరోజు మరోసారి ప్రశ్నించారు.
హత్య జరిగిన రోజు దీన్ని గుండెపోటుగా, సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు? హత్య జరిగిన రోజు మీకు సమాచారం ఎన్ని గంటలకు తెలిసింది? స్పాట్ కి ఎన్ని గంటలకు వెళ్లారు? వెళ్లిన తర్వాత అక్కడ ఎవిడెన్స్ మొత్తం కూడా ఎందుకు ట్యాంపరింగ్ చేశారు? వివేకా ఇంటికి వెళ్లాక ఎవరెవరికి కాల్ చేశారు? ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతికి ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది? ఈ అంశాలపై సుదీర్ఘంగా సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాశ్ రెడ్డి విచారణ మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ చేసింది సీబీఐ.