Jogi Ramesh
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగాల్సి ఉన్న వేళ వైసీపీ నేతల టికెట్ల విషయంపై ఉత్కంఠ నెలకొంది. కొందరు మంత్రుల స్థానాలు మారుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పెడన, పెనమలూరు నియోజక వర్గాలపై వైసీపీ అధిష్ఠానం నుంచి క్లారిటీ వచ్చేసింది. మంత్రి జోగి రమేశ్ గత ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి జోగి రమేశ్కు పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇచ్చేందుకు ఆయన పేరును సీఎం జగన్ ఫైనల్ చేశారు. ఇక పెడన నుంచి ఉప్పల హారికను బరిలోకి దింపుతున్నారు.
వైసీపీలో చేరిన తిరువూరు టీడీపీ ఇన్ఛార్జి
మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఇన్ఛార్జి స్వామి దాస్ వైసీపీలో చేరారు. తాడేపల్లి సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి స్వామి దాస్ వెళ్లారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. తిరువూరు వైసీపీ అభ్యర్థిగా స్వామి దాస్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
టీడీపీలోకి తిరువూరు ఎమ్మెల్యే?
తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరే అవకాశం ఉంది. తిరువూరు వైసీపీ అభ్యర్థిగా స్వామి దాస్ను బరిలోకే దించే అవకాశం ఉండడంతో రక్షణ నిధి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పార్థసారథి సంప్రదింపులు
ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రేపు హైదరాబాద్లో పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబుని కలవనున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్ఠానంతో పార్థసారథి సంప్రదింపులు జరిపారు. పార్థసారథికి నూజివీడు సీటు ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. పెనమలూరే కావాలని పట్టుబడుతున్నారు పార్థసారథి. వైసీపీలోని పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే దిశగా టీడీపీ ఆలోచిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?