పార్టీ కన్నా వైఎస్సార్ కుటుంబమే నాకు ముఖ్యం.. ఎమ్మెల్యే తిప్పేస్వామి
సీఎం జగన్కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని.. ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి అన్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 6, 2024 / 01:33 PM IST
YSRCP MLA Mopuragundu Thippeswamy says not changing party
Mopuragundu Thippeswamy: తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి అన్నారు. అమరావతిలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కన్నా వైఎస్సార్ కుటుంబమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడబోనని తెలిపారు.
”నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. 47 సంవత్సరాలుగా వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్నాను. చిత్తూరు జిల్లాలో సివిల్ సర్జన్ గా చేస్తున్నప్పుడే నన్ను చిత్తూరు ఎమ్మెల్యే చేశారు వైఎస్సార్. చిత్తూరు ఎంపీగా పోటీచేసి ಓడిపోయాను. మడకశిరలో రెండు సార్లు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నాను. కొన్ని కారణాలతో ఇప్పుడు ఇంచార్జ్ గా ఉన్నాను. జగన్ గారు నాకు న్యాయం చేస్తారని నమ్మకం వుంది. పార్టీ కన్నా నాకు వైఎస్సార్ కుటుంబమే ముఖ్యం. జగన్ సార్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. నేను అడగకపోయినా టీటీడీ బోర్డు సభ్యుడిని చేశారు. పక్క పార్టీ చూపులు చూడను. నా వయసు 70 సంవత్సరాలు. పార్టీ ఎప్పటికీ మారన”ని ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు.
Also Read: చిరంజీవి ఫోన్ చేసి చెబితేనే కదా నాదండ్ల మనోహర్.. నిన్ను క్షమించారు..
