Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు..
వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా ..
- Naveen
- Published On : June 17, 2025 / 12:13 AM IST
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటల లోపు నగదు చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు కేటాయింపు చేస్తారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్ లైన్ కోటా 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది.
వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవకు (తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్ వైజర్ల సేవల ఆగస్టు నెల కోటా 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.
