Byju Layoffs Employees : ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ (Byju) కొన్ని ఏళ్ల క్రితం వరకు దేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్లలో ఒకటిగా నిలిచింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం(FY21)లో, కంపెనీ భారీ నష్టాన్ని రూ. 4,564 కోట్లుగా నివేదించింది. ఆ తర్వాత, అక్టోబర్ 2022లో కంపెనీ 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత అనేక సార్లు కంపెనీ ఉద్యోగులను ఇంటికి పంపింది. దాంతో వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడింది.
మనీకంట్రోల్ నివేదిక (Moneycontrol Report) ప్రకారం.. బైజూస్ ఇప్పుడు మరో రౌండ్ తొలగింపులకు ప్లాన్ చేస్తోంది. ఈసారి దాదాపు 4వేలు లేదా 5వేల మందికి పింక్ స్లిప్ (Pink Slip to Byju Employees) అందజేసే అవకాశం కనిపిస్తోంది. బైజూ ఇటీవలే అర్జున్ మోహన్ (CEO Arjun Mohan)ని కంపెనీ కొత్త సీఈఓ నియమించింది. ఈ కొత్త చీఫ్ కంపెనీని పునర్నిర్మించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉద్యోగాల కోతలను ప్రకటించే అవకాశం ఉంది.
5వేల మందిని తొలగించనున్న బైజూ :
కొత్త సీఈఓ సంస్థను రీస్ట్రక్చర్ చేస్తున్న క్రమంలో బైజూస్ 5వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. ఈ ఉద్యోగాల తొలగింపులతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులపై ప్రధానంగా ప్రభావం ఉండవచ్చు. అయితే, ఆకాష్ ఉద్యోగులు (Aakash Employees )పై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. కొత్త సీఈఓ ఇప్పటికే ఈ నిర్ణయాలను కంపెనీ సీనియర్ నేతలకు తెలియజేశారని నివేదిక పేర్కొంది.
సేల్స్, మార్కెటింగ్, ఇతర వంటి అనేక బృందాలు రాబోయే తొలగింపులతో ప్రభావితం కావచ్చు. ఆపరేటింగ్ నిర్మాణాలను సులభతరం చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి కంపెనీ ఈ దిశగా నిర్ణయం తీసుకుందని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. కొత్త సీఈఓ మోహన్ రాబోయే వారాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయడమే కాకుండా స్థిరమైన కార్యాచరణను ముందుకు నడిపిస్తారని తెలిపారు.
Byju Layoffs Employees : New CEO Arjun Mohan
ఉద్యోగులకు మాజీ బైజూ సీఈఓ క్షమాపణలు :
అక్టోబర్ 2022లో ఉద్యోగాల కోతలను ప్రకటించిన తర్వాత బైజూ సీఈఓ ఇమెయిల్లో ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ‘మా కంపెనీలో డూప్లికేషన్ను నివారించడానికి సహోద్యోగులలో 2500 మందిని తొలగించాల్సి వస్తోంది. ఉద్యోగుల జాగ్రత్తగా చూసుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటాం. అయితే, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం చాలా బాధాకరమైనది..
ఈ కష్టమైన నిర్ణయంతో సంస్థను పరిరక్షించడానికి, ఆర్థికపరంగా ఎదురైన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి’ అని ఇమెయిల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ.. ఈ మార్పుతో ఉద్యోగులకు సాయం చేస్తానని వాగ్దానం చేశారు. (BYJU) నుంచి నిష్క్రమించాల్సిన ఉద్యోగులంతా క్షమాంచాల్సిందిగా ఆయన కోరారు.
‘మీరు నాకు కేవలం పేరు కాదు. మీరు ఒక సంఖ్య కానే కాదు. నా కంపెనీలో కేవలం 5 శాతం మాత్రమే.. అలాగే, నాలో ఐదు శాతం. మీ నష్టాన్ని నిజంగా ఏదీ భర్తీ చేయలేదని నాకు తెలుసు. మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే.. నా హృదయాన్ని కూడా కలచివేస్తోంది.
మీరు సంస్థ కోసం ఎంతో చేశారు. అనుకున్నదానికంటే చాలా ఎక్కువ. నేను నా వంతు ప్రయత్నం చేశానని చెప్పినప్పుడు మీరు నన్ను నమ్ముతారని నేను ఆశిస్తున్నాను. మీ స్థానాన్ని కాపాడుకోండి. దయచేసి ఇది మీ పనితీరుకు ప్రతిబింబం కాదని కూడా తెలుసుకోండి. మీరు ఒంటరిగా సంస్థ నుంచి బయటకు వెళ్లరని వాగ్దానం చేస్తున్నాను. మిగిలిన వారంతా మీ పక్కన నడుస్తూ మీ పరివర్తనకు సపోర్టు ఇస్తాం’ అని మాజీ సీఈఓ భరోసా ఇచ్చారు.