దెబ్బకు దెబ్బ.. అమెరికా 145 శాతం టారిఫ్ వేస్తే చైనా కూడా తగ్గేదే లే అంటూ.. భారీగా కౌంటర్ టారిఫ్ లు

మొదటి నుంచి ఎలా పెంచుకుంటూ వస్తున్నారో తెలుసా?

అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ టారిఫ్‌లు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని చెప్పింది.

చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లను విధించుకుంటూ పోతున్న నేపథ్యంలో డ్రాగన్‌ కంట్రీ కూడా అదే పని చేసుకుంటూ పోతోంది. దీంతో చివరకు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బంద్‌ అయ్యే పరిస్థితులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

చైనాపై ట్రంప్ సుంకాలను 145 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. చైనాపై అమెరికా విధిస్తున్న సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నియమాలు, ఆర్థిక చట్టాలను ఉల్లంఘించడమేనని డ్రాగన్ కంట్రీ అంటోంది. ట్రంప్ విధిస్తున్న సుంకాల ద్వారా ఏర్పడిన ప్రపంచ ఆర్థిక ప్రతికూల దుస్థితిపై అమెరికా బాధ్యత వహించాలని చెప్పింది.

Also Read: ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి గోల్డ్ రేటు.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇక్కడ తెలుసుకోండి..

గ్లోబల్‌గా తొలి రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా. ఈ ఇరు దేశాలు కొన్ని రోజులుగా అదనపు టారిఫ్‌లు విధించుకుంటూ పోతుండడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోతుందన్న ఆందోళనలు ఉన్నాయి. అమెరికా 2024లో చైనాకు 143.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అదే సమయంలో 438.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.

ఇలా పెంచుకుంటూ పోయారు..

  • మొదట చైనాపై ట్రంప్‌ అదనంగా 34 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాల శాతం కొన్ని రోజుల క్రితం 54%గా ఉండేది
  • ఆ తర్వాత యూఎస్‌పై డ్రాగన్‌ కంట్రీ కూడా అదనంగా 34 శాతం అదనపు సుంకాలు విధించింది
  • అనంతరం చైనాపై ట్రంప్ 104 శాతం సుంకాలు విధించారు
  • దీంతో చైనా ఆ అదనపు సుంకాలను 84 శాతానికి పెంచింది
  • చైనాపై ట్రంప్‌ తాజాగా సుంకాలను 145 శాతానికి పెంచారు
  • ఇవాళ అమెరికాపై చైనా సుంకాలను 125 శాతానికి పెంచింది